అత్తాపూర్‌ ఆర్డీవోకు నెలరోజుల జైలు శిక్ష | Hyderabad RDO Sentenced For Court Contempt Case | Sakshi
Sakshi News home page

అత్తాపూర్‌ ఆర్డీవోకు నెలరోజుల జైలు శిక్ష

Apr 18 2026 9:25 AM | Updated on Apr 18 2026 10:58 AM

Hyderabad RDO Sentenced For Court Contempt Case

సాక్షి, హైదరాబాద్‌: కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు గాను రాజేంద్రనగర్‌ మండలం, అత్తాపూర్‌ ఆర్డీవో కొప్పుల వెంకట్‌రెడ్డికి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం  నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో రెండు వారాలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఈ ఉత్తర్వులపై అప్పీల్‌కు వీలుగా తీర్పు అమలును రెండు వారాలపాటు నిలిపివేసింది. 

రెండు వారాలు ముగిసిన తర్వాత శిక్ష అమలుకు వీలుగా రిజి్రస్టార్‌ ఎదుట లొంగిపోవాలని స్పష్టం చేసింది.  శంషాబాద్‌ మండలం, పెద్దషాపూర్‌లోని 74 ఎకరాల భూ వివాద కేసులో ఉత్తర్వులు జారీ చేయడం లేదంటూ హైదరాబాద్‌కు చెందిన యూసుఫుద్దీన్‌ ఖాన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆరు వారాల్లో చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని గత ఏడాది ఫిబ్రవరిలో ఆర్డీవోను ఆదేశించింది. 

అయినా.. ఆర్డీవో పట్టించుకోకపోవడంతో పిటిషనర్‌ ధిక్కరణ పిటిషన్‌ వేశారు. పిటిషన్‌పై జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరు పక్షాల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి.. కోర్టు నిర్ణయించిన గడువులోగా ఉత్తర్వులు జారీ చేయడంలో ఆర్డీవో విఫలమయ్యారని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత అమలు చేసినా దానిని అంగీకరించలేమని, నిర్ధేశించిన సమయాన్ని పాటించపోవడం ధిక్కరణే అని నిర్థారిస్తూ నెల రోజుల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.    

Advertisement
 
Advertisement
Advertisement