బాధితులకు అండగా నిలిచి అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టించాల్సిన పోలీసులు శాంతి భద్రతలకే విఘాతం కలిగిస్తున్నారు.
చీరాల, న్యూస్లైన్ : బాధితులకు అండగా నిలిచి అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టించాల్సిన పోలీసులు శాంతి భద్రతలకే విఘాతం కలిగిస్తున్నారు. రోజూవారీ కలెక్షన్ల యావే తప్ప.. రక్షణ కోసం పోలీసుస్టేషన్లో అడుగు పెట్టే బాధితుల గోడు వినే దిక్కేలేదు. పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయాలంటే జేబు నిండుగా ఉండాల్సిందే. స్టేషన్లోనే పంచాయితీలు చేసి అనుమానాస్పద మృతి కేసులను మాఫీ చేస్తున్న కొందరు పోలీస్ అధికారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చీరాల సబ్ డివిజన్ పరిధిలోని పలు పోలీసుస్టేషన్లలో కాసులిస్తే ఎలాంటి కేసులైనా నీరుగార్చుతున్నారు. ఇందులో ముఖ్యంగా డీఎస్పీ కార్యాలయానికి దగ్గరలో ఉండే పోలీసుస్టేషన్ తీరు మరీ ఘోరం. నెల క్రితం విజయ్నగర్కాలనీకి చెందిన ఓ లారీ డ్రైవర్ అనుమానాస్పదంగా మృతి చెందాడు.
చీరాల కేంద్రంగా జరిగే దొంగ గాడిదల అక్రమ రవాణా లారీకి అతడు డ్రైవర్గా వెళ్లేవాడు. ఒక ముఠాతో కలిసి వెళ్లిన ఆ డ్రైవర్ ఇంటికి శవమై తిరిగి వచ్చాడు. దొంగిలించిన గాడిదలను విక్రయించుకుని సొమ్ము చేసుకునే విషయంలో వివాదాలు ఏర్పడి హత్యకు దారి తీశాయా.. అనే అనుమానాలున్నాయి. ముఠాలోని ఇద్దరు వచ్చి మీ వాడు విరేచనాలు, వాంతులు చేసుకుని చనిపోయాడంటూ వెళ్లిపోతుండగా అతని కుటుంబ సభ్యులు పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరితో పాటు దొంగ గాడిదల రవాణాకు వినియోగించిన లారీ, వారి వద్ద ఉన్న * 20 వేల నగదు తీసుకుని పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. గాడిదలు రవాణా చేసే ముఠా యజమానిని కూడా స్టేషన్కు పిలిపించారు.
అక్కడ పంచాయితీ చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు బుట్టదాకలైంది. అదుపులోకి తీసుకున్న లారీ బయటకు వచ్చేసింది. ఎలాంటి కేసులేదు..పాడులేదు. దీని వెనుక పెద్ద మొత్తంలోనే పోలీస్ అధికారులు, సిబ్బందికి ముడుపులు ముట్టాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. అటువంటి అనుమానాస్పద మృతి కేసు కూడా సెటిల్మెంట్తో నీరుగారిపోయింది. అదే స్టేషన్కు చెందిన పోలీసులు సాయికాలనీకి చెందిన ఒక యువకుడిని అదుపులోకి తీసుకొని కొన్ని రోజులు స్టేషన్లో పెట్టి విచారించారు. తాను బంగారం దొంగిలించి కర్ణాటకకు చెందిన ఓ వ్యాపారికి విక్రయించానని అతను పోలీసులకు చెప్పాడు. సదరు వ్యాపారిని కర్ణాటక నుంచి స్టేషన్కు తీసుకొచ్చి నాలుగైదు రోజుల పాటు ఉంచి రెండు కేజీల బంగారం కొనుగోలు చేశావంటా తమదైన శైలిలో విచారించారు. చివరకు పోలీసుల వేధింపులు తాళలేక 150 గ్రాముల బంగారాన్ని స్థానికంగానే కొనుగోలు చేసి పోలీసులకు ఇచ్చి వ్యాపారి కర్ణాటక వెళ్లాడు. ఇది జరిగి 15 రోజులు దాటినా ఎలాంటి రికవరీ చూపించకపోవడం గమనార్హం.
ఆ స్టేషన్ పరిధిలో అనేక దొంగతనాలు జరిగాయి. నిందితులను అరెస్ట్ చేయడం కానీ, రికవరీ చూపించడం కానీ జరగడం లేదు. కానీ దొంగల నుంచి రికవరీ చేసిన బంగారం మాత్రం ఏమవుతుందో.. ఏమో కానీ ఆ లోగుట్టు పెరుమాళ్లకే తెలియాలి. ఇదిలా ఉంటే అనేక కేసుల్లో రికవరీ చేసిన పాత ఇసుము ఆ స్టేషన్లో చాలాకాలం నుంచి ఉండాలి. ఇటీవల ఆ ఇనుము చాలా వరకు మాయమైంది. పాత ఇనుము కొట్టుకు పోలీసులే అమ్మేశారనే ఆరోపణలు ఉన్నాయి. రికవరీ చేసిన సొత్తును కోర్టుకు అప్పగించాల్సి ఉండగా ఆ స్టేషన్ పోలీసులు, అధికారులు మాత్రం తమ సొంత జేబుల్లోకి మళ్లిస్తున్నారు.
ఇదిలా ఉంటే భార్యాభర్తల గొడవ కేసుల్లో సైతం పోలీసుస్టేషన్కు పిలిపించి ఇద్దరి వద్ద భారీగా వసూలు చేస్తున్నారు. లేదంటే పలు సెక్షన్లు సాకుగా చూపి జీవిత కాలం జైల్లో పెడతామని బెదిరింపులకు పాల్పడి ఇద్దరి కుటుంబ సభ్యుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. చిన్నపాటి కేసులపై ఆ స్టేషన్కు వెళితే పోలీస్ వాహనం రిపేరు వచ్చిందని * 30 నుంచి * 40 వేల వరకు ఖర్చవుతుందని, మీరే చేయించాలంటూ హుకుం జారీ చేస్తుండటంతో ఆ వైపు వెళ్లాలంటేనే బాధితులు బెంబేలెత్తుతున్నారు. దీనికితోడు చినగంజాం, పందిళ్లపల్లి, వేటపాలెం మండలాల నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీలను రాత్రి వేళల్లో నిలిపి సిబ్బంది పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
అలానే ఐడీ పార్టీ పేరుతో అనధికారికంగా వ్యవహరిస్తున్న కొందరు సిబ్బంది సివిల్ పంచాయితీల్లో తలదూర్చి సొమ్ము చేసుకుంటున్నారు. రక్షణ కల్పించాల్సిన వారే కాసుల వైపే మొగ్గు చూపటంతో బాధితులకు అన్యాయం జరుగుతోంది. ఆ స్టేషన్తో పాటు సబ్ డివిజన్లో ఉన్న అన్ని పోలీస్స్టేషన్ల పరిస్థితీ ఇదే విధంగా ఉంది. కేసు వచ్చిందంటే కాసులొస్తాయన్న ధ్యాసే తప్ప శాంతి భద్రతలపై దృష్టి సారించడం లేదు. ఇందుకు ఉదాహరణే ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న దొంగతనాల కేసులు.