మట్కా గ్యాంగ్ ఆట కట్టు | Police has been arrested Gamblers | Sakshi
Sakshi News home page

మట్కా గ్యాంగ్ ఆట కట్టు

Oct 31 2013 1:00 AM | Updated on Aug 17 2018 8:06 PM

వ్యవసాయ కూలీలు, కార్మికులు, చిల్లర వ్యాపారులు కష్టార్జితాన్ని జలగల్లా పీల్చుకు తింటున్న మట్కా గ్యాంగ్ సభ్యులు పోలీసులకు పట్టుబడ్డారు.

నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: వ్యవసాయ కూలీలు, కార్మికులు, చిల్లర వ్యాపారులు కష్టార్జితాన్ని జలగల్లా పీల్చుకు తింటున్న మట్కా గ్యాంగ్  సభ్యులు పోలీసులకు పట్టుబడ్డారు. పాణ్యం సర్కిల్ పరిధిలోని రెండు ముఠాలను అరెస్ట్ చేసి, రూ.75వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ అమర్‌నాథ్‌నాయుడు, పాణ్యం సీఐ శ్రీనాథరెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో మట్కాగ్యాంగ్‌ల గురించి వివరించారు. పాణ్యం పరిధిలోని నెరవాటి వెంకటేశ్వర్లు, సాలబోయిన రాము, షేక్ఫ్రి, నాగేంద్ర, అచ్చకోట్ల జమాల్‌బాష, కాట్రావత్ రేఖానాయక్, పాణ్యం, సుగాలిమెట్ట ప్రాంతంలో మట్కా  నిర్వహించేవారు.  నంద్యాల పట్టణంలోని బషీర్(బొగ్గులైన్), షేక్ఫ్రి(కోటవీధి), పులిమద్ది వేణుగోపాల్(పెద్దబండ) జత కలిశారు. ఈ ముగ్గురు పట్టణంలో  మట్కా కలెక్షన్లను సేకరించి, పాణ్యం గ్యాంగ్‌కు అప్పజెప్పేవారు.  ఎవరికైనా మట్కా నెంబర్ తగిలినా ఈ గ్యాంగ్ గెలిచిన సొమ్మును ఇవ్వకుండా బెదిరించేవారు. ఈ గ్యాంగ్ సభ్యులను పాణ్యం సీఐ శ్రీనాథరెడ్డి పాణ్యంలోని మౌలాలిస్వామి దర్గావద్ద అరెస్ట్ చేసి రూ.53,320, 8సెల్‌ఫోన్లు, మట్కా చీటీలు స్వాధీనం చేసుకున్నారు.
 మట్కా నిర్వాహకుడు, అనుచరుల అరెస్ట్..
 నందివర్గం ప్రాంతంలో పేరొందిన మట్కా నిర్వాహకుడు సయ్యద్ రఫీద్ అహ్మద్, అతని అనుచరులను అరెస్ట్ చేశారు. రామకృష్ణపురంకు చెందిన సయ్యద్ రషీద్ అహ్మద్ కొన్నేళ్లుగా మట్కా నిర్వహిస్తూ ప్రస్తుతం బనగానపల్లెలో నివాసముంటున్నాడు. ఆయన పలుకూరు, రామతీర్థం, టంగుటూరు గ్రామాల్లో అనుచరులు షేక్ ఇస్మాయిల్, దళిత హుసేని, వడ్డగోగుల సుబ్బరాయుడు, మొల్లి మహ్మద్ హుసేన్‌లను బీటర్లుగా ఏర్పాటు చేసుకొని దందాను నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ గ్యాంగ్‌ను రామతీర్థంలోని ఆంజనేయస్వామి గుడి వద్ద  వలపన్ని పట్టుకున్నారు. వీరి నుంచి రూ.22వేలు, మూడు సెల్‌ఫోన్లు, మట్కా చీటీలను స్వాధీనం చేసుకున్నామన్నారు. మట్కా గ్యాంగ్‌ల అరెస్ట్‌లో కీలక పాత్రను వహించిన కానిస్టేబుల్ రమేష్‌కు డీఎస్పీ అమర్‌నాథ్‌నాయుడు, సీఐ శ్రీనాథరెడ్డి నగదు రివార్డును అందజేశారు.  సమావేశంలో పాణ్యం, నందివర్గం ఎస్‌ఐలు సుబ్రమణ్యం, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement