విభజన హామీలపై స్పష్టత ఇవ్వాలి : వైఎస్ జగన్
రాష్ట్ర విభజన హామీలపై స్పష్టత ఇవ్వాలని వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన రెడ్డి కాబోయే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరారు.
ఢిల్లీ: రాష్ట్ర విభజన హామీలపై స్పష్టత ఇవ్వాలని వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన రెడ్డి కాబోయే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరారు. తమ పార్టీ ఎంపీలతో కలిసి జగన్ ఈరోజు గుజరాత్ భవన్కు వెళ్లి నరేంద్రమోడీని కలిశారు. మోడీతో వారు దాదాపు 45 నిమిషాలు సమావేశమయ్యారు. ఎన్నికల్లో విజయంపై మోడీకి అభినందనలు తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయాన్ని వారు మోడీకి వివరించారు. జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరారు. కొత్తగా ఏర్పడే రాజధానికి కావలసిన నిధులు ఇవ్వాలని కూడా వారు అడిగారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రాష్ట్ర హోదా, పన్ను రాయితీలు, ప్రోత్సహాకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు మోడీకి ఒక వినతి పత్రం అందజేశారు. కొత్త రాష్ట్రానికి తాను అన్ని విధాల సహయ సహకారాలు అందజేస్తానని మోడీ వారికి హామీ ఇస్తారు.
అనంతరం గుజరాత్ భవన్ వద్ద జగన్ విలేకరులతో మాట్లాడారు. విభజన సమయంలో సీమాంధ్రకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. సీమాంధ్ర, తెలంగాణలలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయాలని మోడీని కోరినట్లు తెలిపారు. ఎన్డిఏ ప్రభుత్వానికి తమ మద్దతు అవసరం లేకపోయినా, అంశాల ప్రాతిపదికన మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని విలేకరుల ప్రశ్నకు జగన్ సమాదానం చెప్పారు.
సీమాంధ్రకు సహాయసహకారాలు అందిస్తామని మోడీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. తమ విజ్ఞప్తిపై మోడీ సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. రాష్ట్రానికి మంచి జరుగుతుందని భావిస్తున్నామని జగన్ అన్నారు.
వినతి పత్రంలోని ముఖ్యమైన అంశాలు:
1. కేజీబేసిన్లో రాష్ట్రానికి వాటా ఇవ్వాలి
2.తుఫాన్తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
3.చిత్తూరు జిల్లా మన్నవరం ప్రాజెక్టును పూర్తిచేయాలి
4.తెలంగాణలో ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించాలి
5. రాష్ట్రవిభజన చట్టంలో సీమాంధ్రకు ఇచ్చిన రాయితీలన్నీ అమలు చేయాలి
6. సీమాంధ్రకు 15సంవత్సరాలపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలి
7. వైఎస్ఆర్ జిల్లాలో సెయిల్ స్టీల్ప్లాంట్ ఏర్పాటు చేయాలి
8. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి క్రూడాయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలి
9. పెట్రో కెమికల్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయాలి
10.వైజాగ్, చెన్నై మధ్య ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలి


