‘మహానేత పాలన ఓ స్వర్ణయుగం’
సాక్షి, వైఎస్సార్: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన ఓ స్వర్ణయుగమని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన తనయుడిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాంటి పాలనను మరింత అభివృద్ధి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం వైఎస్సార్ కడప జిల్లా రాయచోటిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్ నవరత్నాల పోస్టర్లను శ్రీకాంత్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలతో ప్రతి కుటుంబం ఆనందంగా ఉంటుందని అన్నారు.
సుదీర్ఘ పాదయాత్రలో ప్రజాసమస్యలు తెలుసుకుని, నవరత్నాలను పొందుపరిచారని తెలిపారు. నవరత్నాలను ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. గత ఎన్నికలలో ఇచ్చిన హమీలు నెరవేర్చని చంద్రబాబును ప్రజలెవ్వరూ నమ్మటంలేదన్నారు.