
'ఇంతటి ప్రజా వ్యతిరేకత వస్తుందనుకోలేదు'
చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని వైఎస్ఆర్ సీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు వ్యాఖ్యానించారు.
తిరుపతి : చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని వైఎస్ఆర్ సీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన అయిదు నెలలకే ఇంతటి ప్రజా వ్యతిరేకత వస్తుందని ఎవరూ ఊహించలేదని వారు గురువారమిక్కడ అన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీలు గుప్పించి ... అధికారాన్ని చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారన్నారు. బాబు ఇచ్చిన హామీలన్నీ ఎన్నికల్లో గట్టెక్కడానికే అని తేలిపోయిందని వైఎస్ఆర్ సీపీ నేతలు వ్యాఖ్యానించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో చేపట్టిన ధర్నాకు రైతులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, శ్రీనివాసులు అన్నారు. రుణమాఫీకి నిన్నటివరకూ నిబంధనలు పెడుతూ వచ్చిన చంద్రబాబు... ఇప్పుడు రైతుల ఖాతాలనే కుదించటం దారుణమన్నారు. రైతులు, మహిళ పక్షాన వైఎస్ఆర్ సీపీ ఎప్పుడూ పోరాటం చేస్తుందని వారు తెలిపారు.