పింఛన్ పంపిణీకి ఫినో | Pension distribution phino | Sakshi
Sakshi News home page

పింఛన్ పంపిణీకి ఫినో

Nov 3 2014 2:26 AM | Updated on Sep 2 2017 3:46 PM

జిల్లాలో మొత్తం 4,12,111 మంది పింఛన్‌దారులు ఉండేవారు. దాదాపు ఆరు నెలల నుంచి స్మార్ట్‌కార్డు విధానాన్ని అమలు చేస్తున్నారు.

జిల్లాలో మొత్తం 4,12,111 మంది పింఛన్‌దారులు ఉండేవారు. దాదాపు ఆరు నెలల నుంచి స్మార్ట్‌కార్డు విధానాన్ని అమలు చేస్తున్నారు. వేలిముద్రలు సరిపోలకపోవడంతో ఒకేసారి జిల్లా వ్యాప్తంగా 1.42 లక్షల మందికి పింఛన్లు ఆగిపోయాయి. ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకెళుతున్నా..  ప్రతినెలా కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. దీనివల్ల అందరికీ పింఛన్లు అందడం లేదు.

బాధితులు స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఏజెన్సీ వారిపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ఈ ఒత్తిళ్లు నెలనెలా మరింత అధికం అవుతుండడంతో పంపిణీ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకునే యోచనలో ఏజెన్సీ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతోంది. పోస్టాఫీసు ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించింది.

 గత నెల పింఛన్లే పంపిణీ చేయని వైనం  
 టీడీపీ ప్రభుత్వంలో పింఛన్‌దారుల అవస్థలు అన్నీఇన్నీ కావు. ఉన్న పింఛన్లను తొలగించడంతో పాటు అర్హులకు సైతం ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పింఛన్ల తనిఖీ కమిటీలు ఐదెకరాల కన్నా ఎక్కువ భూమి ఉన్న వారిని అర్హుల జాబితా నుంచి తొలగించాయి. వివిధ కారణాలతో  జిల్లాలో  దాదాపు 1.20 లక్షల మంది పింఛన్‌దారులను సస్పెన్స్‌లో పెట్టారు.

ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా ఐదెకరాల నుంచి పదెకరాలకు మినహాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు మాత్రం నేటికీ వెలువడలేదు. ఆన్‌లైన్‌లో నిబంధనలు సడలించకపోవడంతో వేల మంది  అనర్హులుగా మారిపోయారు. ‘జన్మభూమి- మా ఊరు’ పుణ్యమాని అక్టోబర్  పింఛన్లు నేటికీ పంపిణీ చేయలేదు. ఇక నవంబర్ పింఛన్లు ఎప్పుడిస్తారో ఎవరికీ అంతుచిక్కడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement