వేరుశెనగ పోయినట్టే | Peanuts poyinatte | Sakshi
Sakshi News home page

వేరుశెనగ పోయినట్టే

Oct 14 2014 3:03 AM | Updated on Oct 1 2018 2:44 PM

మదనపల్లె డివిజన్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్‌లో సాగుచేసిన వేరుశెనగ పంట దెబ్బతింది. పెట్టుబడులూ చేతికందక రైతులు పుట్టెడు అప్పుల్లో కూరుకుపోయారు.

మదనపల్లె డివిజన్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్‌లో సాగుచేసిన వేరుశెనగ పంట దెబ్బతింది. పెట్టుబడులూ చేతికందక రైతులు పుట్టెడు అప్పుల్లో కూరుకుపోయారు. డివిజన్ పరిధిలో రూ.280 కోట్ల వరకు నష్టాలు వాటిల్లినట్టు అంచనా.
 
70 వేల హెక్టార్లలో పంట నష్టం


ఖరీఫ్‌లో రెండు విడతలుగా జూన్, జూలై నెలల్లో రైతులు 70 వేల హెక్టార్ల (1.75 లక్షల ఎకరాలు)లో వేరుశెనగను సాగుచేశారు. మూడు నెలల కాలంలో 20 రోజుల పాటు పూర్తిగా డ్రైస్పెల్ వచ్చాయి. పూత, ఊడ, గింజ పట్టే దశలో వర్షం కురవక పంట దెబ్బతింది. డివిజన్‌లో సాధారణ వర్షపాతం 480 మి.మీ కాగా, ఈ సీజన్‌లో 40 శాతం తక్కువ కురిసింది. దీంతో వేరుశెనగ పంట పూర్తిగా దెబ్బతింది.
 
ఎకరా సాగుకు రూ.15 వేల ఖర్చు


ఎకరా పొలంలో వేరుశెనగను సాగుచేసి ఒబ్బిడి చేయాలంటే రైతులకయ్యే ఖర్చు రూ.15 వేలు. వర్షాలు బాగా కురిసుంటే ఎకరాకు 15 బస్తాలు (బస్తా 40 కిలోలు)తో ఆరు క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. ఆ లెక్కన ఎకరాకు ప్రస్తుతమున్న ధర ప్రకా రం క్వింటాళ్ రూ.5 వేలు చొప్పున రూ.30 వేలు వచ్చేది. పెట్టుబడి రూ.15 వేలు పోను రూ.15 వేలు చేతికందేది. కానీ ఈ దఫా పూర్తిగా పంట నష్టం కావడంతో రైతులకు పది కిలోల కాయలు కూడా దొరకడం లేదు. మరోవైపు ఎండిన వేరుశెనగను రైతులు పశువులకు మేతగా వేస్తున్నారు.
 
ఇన్‌పుట్ సబ్సిడీతో ఆదుకోవాల్సిందే
 
నాలుగేళ్లుగా ఈ ప్రాంతంలో వేరుశెనగ రైతులకు సక్రమంగా ఇన్సూరెన్స్, ఇన్‌పుట్ సబ్సిడీ అందలేదు. గ త ఏడాది సైతం వేరుశెనగ తీవ్రంగా దెబ్బతింది. ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది. జిల్లా అధికారులు హెక్టారుకు రూ.10 వేల చొప్పు న ఇన్‌పుట్ సబ్సిడీ కోసం కేంద్రానికి అంచనాలు పంపి చేతులు దులుపుకున్నారు. ఇంతవరకు రైతులకు పైసా అందలేదు. ఈ ఏడాది వేరుశెనగ పరిస్థితి మరీ ఘోరంగా మారింది. రైతులకు నష్టపరిహారం అందితే గానీ కోలుకోలేని పరిస్థితి.
 

Advertisement
 
Advertisement
Advertisement