స్లాట్‌ లేకుండా పాస్‌పోర్ట్‌ | Sakshi
Sakshi News home page

స్లాట్‌ లేకుండా పాస్‌పోర్ట్‌

Published Thu, Nov 2 2017 12:28 PM

passport application without slat - Sakshi

మర్రిపాలెం(విశాఖఉత్తర): ఒకప్పుడు పాస్‌పోర్ట్‌ పొందడం బోలెడంత ప్రయాసగా ఉండేది. స్లాట్‌ బుకింగ్‌ కోసం దాదాపు రెండు నెలలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. అయితే పాస్‌పోర్ట్‌ మంజూరు ప్రక్రియ వేగవంతం చేయడంతో స్లాట్‌ బుకింగ్‌ అందుబాటులోకి వచ్చింది. ప్రత్యేక మేళాలు, ఆయా జిల్లాలలో పాస్‌పోర్ట్‌ సేవా క్యాంప్‌లతో పాస్‌పోర్ట్‌ యంత్రాంగం నేరుగా సేవలు అందించడంతో కృషికి దగ్గ ఫలితం తగ్గింది. కేవలం ఒకటి లేదా రెండు రోజుల వ్యవధిలో స్లాట్‌ బుకింగ్‌ దొరుకుతోంది. అయితే పాస్‌పోర్ట్‌ యంత్రాంగం మరో అడుగు ముందుకువేసింది. నూతన ఒరవడికి తెరలేపింది. ఇక నుంచి ఆన్‌లైన్‌ బుకింగ్‌తో పని లేకుండా చేసింది. పాస్‌పోర్ట్‌ పొందగోరే అభ్యర్థి ధ్రువపత్రాలతో నేరుగా కార్యాలయానికి వెళితే సేవలు అందిస్తామని పాస్‌పోర్ట్‌ అధికారులు ప్రకటించారు. అభ్యర్థి ఏ రోజు వచ్చినా దరఖాస్తు స్వీకరిస్తామని వెల్లడించారు.

ఒకప్పుడు ధనిక వర్గాలకు పాస్‌పోర్ట్‌ పరిమితం కాగా నేడు అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే పాస్‌పోర్ట్‌ అవసరంగా మారింది. విదేశాలలో విద్య, ఉపాధికి పాస్‌పోర్ట్‌ కీలక పాత్ర పోషిస్తోంది. భవిష్యత్‌లో పాస్‌పోర్ట్‌ అవసరం దృష్ట్యా పాస్‌పోర్ట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. యూఎస్‌ఏ, ఆస్ట్రేలియా, కెనడా, దుబాయ్, ఖతర్, సింగపూర్, మలేషియా, తదితర దేశాలలో ఉద్యోగాల కోసం ఇప్పటికే లక్షలాది మంది పాస్‌పోర్ట్‌లు పొందారు. అయితే పాస్‌పోర్ట్‌ సేవలు సామాన్యులు కూడా సులభంగా పొందవచ్చని పాస్‌పోర్ట్‌ అధికారులు చెబుతున్నారు. కొత్త పాస్‌పోర్ట్‌ మంజూరులో ఆయా అంశాలు వివరించారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు విశాఖలోని పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రంలో సేవలు పొందవచ్చు. అలాగే విశాఖకు అనుబంధంగా పనిచేస్తోన్న విజయవాడ కేంద్రంలో కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల ప్రజలు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పాస్‌పోర్ట్‌ లఘు కేంద్రంలో సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆయా జిల్లాల ప్రధాన పోస్టాఫీసు కార్యాలయాలలో పోస్టాఫీసు పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలు వచ్చాయి.

ఫీజులలో రాయితీ...
కొత్తగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం పాస్‌పోర్ట్‌ ఫీజులలో ప్రభుత్వం మార్పులు చేసింది. గతంలో సాధారణ బుకింగ్‌గా ఆన్‌లైన్‌లో రూ.1,500 చెల్లించాలి. తత్కాల్‌ బుకింగ్‌ ఫీజు రూ.3,500 కాగా ఆన్‌లైన్‌లో రూ.1,500 చెల్లించి మిగతా మొత్తం రూ.2,000 పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రంలో చెల్లించాలి. ఇక నుంచి సాధారణ బుకింగ్‌ రూ.1,500 చెల్లించాలి. మైనర్‌ అయితే రూ.1,000, ఇంకా 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు రూ.1,350, ఎనిమిది ఏళ్ల లోపు వయస్సు మైనర్లు రూ.900 చెల్లించాలని చట్టంలో మార్పులు చేశారు.

పీఎస్‌కేలో సేవలు...
పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రంలో మూడంచెలుగా సేవలు లభిస్తాయి. తొలుతగా అభ్యర్థి గుర్తింపు పత్రాలు పరిశీలిస్తారు. (ఎ) సెక్షన్‌ విభాగంలో అభ్యర్థి ఫొటో, వేలిముద్రలు, ధ్రువపత్రాల స్కానింగ్‌ నిర్వహిస్తారు. (బి) సెక్షన్‌లో ప్రభుత్వ పాస్‌పోర్ట్‌ అధికారులు ఉంటారు. అభ్యర్థి గుర్తింపు, చిరునామా, సంబంధిత పత్రాల పరిశీలన ఉంటుంది. (సి) సెక్షన్‌లో గ్రాంటింగ్‌ అధికారుల ముందు అభ్యర్థి నేరుగా హాజరుకావాలి. అభ్యర్థి వివరాలు, పత్రాలు పరిశోధన అనంతరం అర్హుడా! అనర్హుడా! అనేది ధ్రువీకరిస్తారు. అధికారులు గ్రాంటింగ్‌ చేయడంతో పోలీస్‌ దర్యాప్తునకు వివరాలు చేరవేస్తారు. సంబంధిత రశీదు అభ్యర్థికి అందజేస్తారు.  

పోలీస్‌ దర్యాప్తు
పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రంలో సేవలు తర్వాత పోలీస్‌ దర్యాప్తు చేయాల్సిందిగా అధికారులు ఆన్‌లైన్‌లో తెలియజేస్తారు. పోలీసుల విచారణలో భాగంగా అభ్యర్థి ఇంటికి వెళ్లి చిరునామా పరిశీలిస్తారు. అభ్యర్థి సమర్పించిన పత్రాలు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అన్నీ సక్రమంగా తేలితే అభ్యర్థికి క్లియర్‌ సర్టిఫికెట్‌ అందజేసి అర్హుడుగా ఆన్‌లైన్‌లో పేర్కొంటారు. ఒక వేళ అభ్యర్థి చిరునామాలో లేకపోయినా, చిరునామా మారినా, చిరునామాలో తేడా, దరఖాస్తులో పొందుపరిచిన వివరాలు తప్పుగా రుజువైతే ఆ విషయం ఆన్‌లైన్‌లో తెలియజేస్తారు. దీంతో పాస్‌పోర్ట్‌ సేవలు నిలిపివేస్తారు. పోలీస్‌ విచారణ సమయంలో అభ్యర్థి లేని పక్షంలో నేరుగా పాస్‌పోర్ట్‌ అధికారిని కలవాలి. చిరునామా పత్రాలు చూపిస్తే మరలా పోలీస్‌ దర్యాప్తునకు ఆదేశిస్తారు.
   
చేతికి పాస్‌పోర్ట్‌...
పోలీస్‌ దర్యాప్తు పూర్తితో పాస్‌పోర్ట్‌ మంజూరుకు గ్రీన్‌ సిగ్నల్‌ వస్తుంది. పోలీస్‌ శాఖ ఆన్‌లైన్‌లో పొందుపరిచిన దర్యాప్తు వివరాలు బట్టి పాస్‌పోర్ట్‌ కార్యాలయంలో అనుమతి లభిస్తుంది. పాస్‌పోర్ట్‌ను ప్రింటింగ్‌ సెక్షన్‌కు పంçపడంతో సేవలు ముగుస్తాయి. అభ్యర్థికి పోస్ట్‌ ద్వారా పాస్‌పోర్ట్‌ చేతికి అందుతుంది. పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రంలో అభ్యర్థి హాజరైన రోజు నుంచి వారం లేదా 10  రోజుల్లోగా పాస్‌పోర్ట్‌ చేరవేయడం జరుగుతోంది.

రిజిస్ట్రేషన్‌ కోసం...
అభ్యర్థి ధ్రువపత్రాలు పరిశీలన అనంతరం కార్యాలయ సిబ్బంది రిజిస్ట్రేషన్‌ జరుపుతారు.  తర్వాత సెకన్ల వ్యవధిలో అభ్యర్థి తెలియజేసిన ‘ఈ–మెయిల్‌’కు పాస్‌పోర్ట్‌ కార్యాలయం నుంచి సమాచారం వస్తుంది. మీ రిజిస్ట్రేషన్‌ పూర్తి కాబడినట్టు సమాచారం సారాంశంగా తెలుసుకోవచ్చు. కొత్త పాస్‌పోర్ట్, పాత పాస్‌పోర్ట్‌ సేవలు, పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ తదితర ఆప్షన్స్‌ ఉంటాయి. కొత్త పాస్‌పోర్ట్‌ ఆప్షన్‌ ఎంచుకోవడంతో సేవలు ప్రారంభిస్తారు.

గుర్తింపు, చిరునామా పత్రాలు
అభ్యర్థి పుట్టిన తేదీ, చిరునామా పత్రాలు తప్పక కలిగి ఉండాలి. కొత్తగా ఆధార్‌ను ఆధారంగా చేసుకుని నిర్థారణ చేస్తున్నారు. గుర్తింపు, చిరునామా కోసం ఆధార్‌ లేదా ఓటర్‌ కార్డులు ఫొటోతో ఉండాలి. ఇంకా ఏదైనా జాతీయ బ్యాంకులో ఖాతా ఉండి గత ఏడాదిగా లావాదేవీలు జరుగుతున్నట్టు స్టేట్‌మెంట్‌ చూపిస్తే గుర్తిస్తారు. గుర్తింపు, చిరునామా పత్రాలతో పాటుగా పాస్‌పోర్ట్‌ ఎందుకు అవసరమో తెలియజేయు పత్రాలు అభ్యర్థి సమర్పించాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement