తప్పుల తడకగా ‘ఇంటింటి సర్వే’ | Panchayati Raj Department survey | Sakshi
Sakshi News home page

తప్పుల తడకగా ‘ఇంటింటి సర్వే’

Nov 4 2017 2:44 AM | Updated on Nov 4 2017 7:21 AM

Panchayati Raj Department survey - Sakshi

సాక్షి, అమరావతి :  గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి పన్ను పెంపును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి సర్వేలో పెద్ద ఎత్తున తప్పులు దొర్లినట్టు అధికారులు గుర్తించారు. మొత్తం 82 లక్షల ఇళ్లకు చేసిన సర్వేలో దాదాపు 20 లక్షల ఇళ్ల సమాచారంలో తప్పులు దొర్లినట్లు గుర్తించారు. గత ఐదు నెలలుగా గ్రామ, మండల స్థాయిలో ఉన్న పంచాయతీరాజ్‌ శాఖ సిబ్బంది పూర్తిగా ఈ కార్యక్రమంపైనే దృష్టిపెట్టి రాష్ట్రంలోని 12,920 గ్రామ పంచాయతీల్లో 82 లక్షల ఇళ్ల సర్వేను పూర్తిచేశారు.

ఇంటి పన్ను రేట్లు పెంచడం కోసం ప్రధానంగా ఈ సర్వే చేపట్టగా, ప్రభుత్వం మాత్రం ఇంటి విలువకు సంబంధించి ఆస్తి సర్టిఫికెట్‌ జారీకోసం సర్వే సమాచారం ఉపయోగించుకుంటామని చెబుతూ వస్తోంది. కాగా ఇంటింటి సర్వేలో.. ఎంత విస్తీర్ణం భూమిలో ఇంటి నిర్మాణం జరిగింది.., నిర్మాణం జరిగిన భవన విస్తీర్ణం ఎంత అన్న వివరాలను.. ఒక్కో ఇంటి వద్ద కొలతలు తీసుకుని, వాటిని ఆన్‌లైన్‌లో పొందుపరిచారు.

పంచాయతీరాజ్‌ శాఖ సిబ్బంది సేకరించిన వివరాలను నిర్ణీత ఫార్మాట్‌లో ఆన్‌లైన్‌లో పొందుపరచడంతో పాటు ఆ ఇంటికి సంబంధించి ఫొటో, జియో ట్యాగింగ్‌ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదుచేసే బాధ్యతలను ఎంట్రో ల్యాబ్స్‌ అనే ఐటీ సంస్థకు అప్పగించారు. వివరాల ఆన్‌లైన్‌ నమోదు చేసినందుకు ఎంట్రో ల్యాబ్‌కు ఒక్కో ఇంటికి రూ.9 చొప్పున చెల్లించేలా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించి 82 లక్షల ఇళ్ల వివరాల సేకరణ, ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ గత నెల 27న ముగిసింది. అయితే.. కొన్ని ఇళ్ల సమాచారం రెండేసి సార్లు నమోదు కావడం.. కొన్ని ఇళ్లకు సంబంధించిన సమచారానికి.. ఆ ఇంటి ఫొటో కూడా పొందపరచనట్టు అధికారులు గుర్తించారు.

ఇళ్ల కొలతల్లో.. నంబర్ల నమోదులో తప్పులు
సర్వేలో ఒక్కో ఇంటి వివరాలు సేకరించాక గ్రామాలవారీగా ఆ ఇంటికి ఒక నంబరు ఇచ్చి దాని వివరాలను కూడా ఆన్‌లైన్‌లో పొందుపరచాల్సి ఉంది. అయితే.. అలాంటి నంబర్లను కూడా పలు ఇళ్లకు పొందపరచలేదని అధికారుల పరిశీలనలో తేలింది. ఇళ్ల కొలతలు పేర్కొనాల్సిన చోట పూర్తిగా తప్పులు దొర్లినట్టు గుర్తించారు.

దాదాపు 20 లక్షల ఇళ్ల సమాచారంలో ఏదో ఒక తప్పు దొర్లినట్టు కనుగొన్నారు. తప్పులు దొర్లిన ఇళ్ల సమాచారాన్ని పునఃపరిశీలించి తిరిగి çసరైన సమాచారం నమోదు చేయాలంటూ పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ రామాంజనేయులు జిల్లా స్థాయి అధికారులతో పాటు ఎంట్రీ ల్యాబ్స్‌ సంస్థ సిబ్బందినీ ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement