నగర పంచాయతీకి 1087 రేషన్‌కార్డులు | panchayat1087 Ration cards | Sakshi
Sakshi News home page

నగర పంచాయతీకి 1087 రేషన్‌కార్డులు

Nov 26 2013 3:44 AM | Updated on Sep 2 2017 12:58 AM

నెల్లిమర్ల నగర పంచాయతీకి ఈ ఏడాది 1087 రేషన్‌కార్డులు మంజూరైనట్టు ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పల నాయుడు చెప్పారు. సోమవారం స్థానిక తుపాను షెల్టర్‌లో

నెల్లిమర్ల, న్యూస్‌లైన్ : నెల్లిమర్ల నగర పంచాయతీకి ఈ ఏడాది 1087 రేషన్‌కార్డులు మంజూరైనట్టు ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పల నాయుడు చెప్పారు. సోమవారం స్థానిక తుపాను షెల్టర్‌లో జరిగిన రచ్చబండ సభలో ఆయన మాట్లాడారు. నెల్లిమర్ల, జరజాపుపేట ప్రాంతాలకు చెందిన కుటుంబాలకు 1020 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. మరో 186 మందికి వివిధ రకాల పింఛన్లు, 24 మంది చిన్నారులకు బంగారుతల్లి పథకం బాండ్లు మంజూరు చేసినట్టు చెప్పారు. రచ్చబండను బహిష్కరిస్తామని నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట ప్రాంతవాసులు ప్రచారం చేసినట్టు తన దృష్టికి వచ్చిందని, దానివల్ల లబ్ధిదారులే నష్టపోతారని తెలిపారు. 
 
 దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తిరిగి కిలో బియ్యం రూ. 2 లకు ఇవ్వడం వల్ల పేదలు కడుపునిండా అన్నం తింటున్నారన్నారు. జిల్లాలో 90 రోజుల పాటు చేపట్టిన సమైక్య ఆందోళనతో అభివృద్ధి కుంటుపడిందని, ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు నిలిచిపోయా యని చెప్పారు. జరగాల్సింది జరుగుతుందని.. ఇప్పుడు ఆందోళనలు చేపట్టి మాత్రం ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. అయితే తాను మాత్రం సమైక్యవాదినేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అనంతరం ఆయన మంజూరైన పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అంబళ్ళ శ్రీరాముల నాయుడు, డీసీసీబీ ఉపాధ్యక్షుడు చెనమల్లు వెంకటరమణ, మాజీ ఎంపీపీ మత్స విజయ, నగర పంచాయతీ ప్రత్యేకాధికారి గోవిందస్వామి, కమిషనర్ అచ్చింనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
 
 దరఖాస్తుదారులను అడ్డుకున్న పోలీసులు
 ఎమ్మెల్యేకు దరఖాస్తు అందజేసేందుకు వచ్చిన లబ్ధిదారులను పోలీసులు అడ్డుకున్నారు. వేదిక వద్ద పోలీసు లు, అధికార పార్టీ నేతలు వారిని అడ్డగించి.. దరఖాస్తులు కౌంటర్లలో ఇవ్వాలని పంపించేశారు. అలాగే సభను జరజాపుపేట వాసులు అడ్డుకుంటారన్న ప్రచారం ఊపందుకోవడంతో భారీగా పోలీసు బందోబస్తు నిర్వహించారు. 8 మంది ఎస్‌ఐలు, 50 మంది కానిస్టేబుళ్లతో బందోబస్తుచేపట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement