తలాపునే మంజీర... | Older people suffering with joint pains due to fluoride water | Sakshi
Sakshi News home page

తలాపునే మంజీర...

Mar 13 2014 3:17 AM | Updated on Oct 9 2018 4:44 PM

పిట్లం మండలంలోని కుర్తి గ్రామం ద్వీపకల్పంగా పేరు గాంచింది. ఎందుకంటే ఈ గ్రామం చుట్టూ మంజీర నది పారుతుంటుంది.

కుర్తి(పిట్లం), న్యూస్‌లైన్:  పిట్లం మండలంలోని కుర్తి గ్రామం ద్వీపకల్పంగా పేరు గాంచింది. ఎందుకంటే ఈ గ్రామం చుట్టూ మంజీర నది పారుతుంటుంది. ‘‘ఈ గ్రామస్తులు ఎంతో అదృష్టవంతులు. మంజీర నీరు తాగుతారు’’ అని అందరూ అనుకుంటారు. కానీ, వారు తాగేది ఫ్లోరైడ్ నీరే!. ఏళ్ల తరబడి ఈ నీటిని సేవి స్తున్న గ్రామస్తులు కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. కుర్తి గతం లో రాంపూర్ కలాన్ పంచాయతీకి అనుబంధంగా ఉండేది. కాలక్రమంలో పంచాయతీగా ఆవిర్భవిం చింది. గ్రామంలో సుమారు వెయ్యికి పైగా జనాభా ఉండగా, రెండు వందలకు పైగా కుటుంబాలు ఉన్నాయి. వీరందరు నిత్యం తమ అవసరాల కోసం గ్రామంలో గల చేతిపంపులు, నీటిట్యాంకు నీరుపైనే ఆధారపడుతున్నారు.

 గ్రామంలో ప్రస్తుతం ఒక నీటి ట్యాంకు, ఎస్సీ కాలనీకి నీరు సరఫరా చేసే మరో మినీ నీటి ట్యాంకు ఉంది. వీటితో పాటుగా మరి కొన్ని చేతిపంపులు ఉన్నాయి. ఈ వనరుల ద్వారా గ్రామస్తులకు ఫ్లోరైడ్ నీరే అందుతోంది. ప్లోరైడ్ నీరు వాడకంతో తమకు రోగాలు వస్తున్నాయని గ్రామస్తులు పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. గతంలో నిర్వహించిన రైతు చైతన్య యాత్రలో భాగంగా అప్పటి కలెక్టర్ క్రిస్టీనా కుర్తి గ్రామానికి వచ్చినపుడు ప్లోరైడ్ నీటి బాధను గ్రామస్తులు ఆమెకు వివరించారు.

 కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య తీర్చుతానని హామీ ఇచ్చారు. అం తేగాక గతంలో చాలా సార్లు ఎమ్మెల్యే హోదాలో గ్రామానికి వచ్చిన హన్మంత్ సింధే దృష్టికి కూడ సమస్యను తీసుకెళ్లారు. ఇలా ఎంతమందికి విన్నవించినా సమస్య తీరలేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెంతనున్న మంజీర నీరును సరఫరా చేయాలని విన్నవించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement