మలకపల్లిలో బుధవారం బాలికకు వివాహం చేయబోతుండగా పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. ఏఎస్సై పీఆర్సీహెచ్ మూర్తి
మలకపల్లి (తాళ్లపూడి) : మలకపల్లిలో బుధవారం బాలికకు వివాహం చేయబోతుండగా పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. ఏఎస్సై పీఆర్సీహెచ్ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. చాగల్లుకు చెందిన 13 ఏళ్ల వయసు బాలికకు మలకపల్లికి చెందిన యువకుడికి వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాలిక తండ్రి యర్రంశెట్టి మునీశ్వరరావు తాళ్లపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు కలిసి మలకపల్లి వచ్చారు. బాల్య వివాహం చేయటం శిక్షార్హమైన నేరమని వారికి చెప్పారు. ఇరు వర్గాల నుంచి బాల్యవివాహం చేయబోమని హామీ పత్రాలు తీసుకున్నారు. యుక్త వయసు వచ్చేవరకు వివాహం చేయబోమని వారు తెలిపారు. బాలిక తల్లి కువైట్లో ఉంటోందని, ఆమె పెద్దమ్మ ఈ వివాహం చేయించేందుకు ఏర్పాట్లు చేసిందని మునీశ్వరరావు తెలిపారు. ఆర్ఐ భారతి, వీఆర్వోలు పి.వెంకటేశ్వరరావు, సత్యనారాయణ వివరాలు సేకరించారు.
ముసుళ్లగుంటలో..
ముసుళ్లగుంట (నల్లజర్ల రూరల్) : ముసుల్లగుంటల్లో బాల్య వివాహాన్ని అధికారులు నిలిపివేశారు. గ్రామానికి చెందిన అందుగుల వీరాస్వామి, గంగమ్మల 16 ఏళ్ల వయసు కుమార్తెకు పెదవేగి మండలం కూచింపూడికి చెందిన యువకుడితో గురువారం వివాహం నిర్చయించారు. బుధవారం పెళ్ళి సన్నాహాలు చేస్తుండగ గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఐసీడీఎస్ సూపర్వైజర్ నయోమిరాణి, ఎస్సై నాయక్, వీఆర్వో సూరిబాబు, సర్పంచ్ బలుసు గంగరాజు, ఎంపీటీసీ కోట బాబు ఆ బాలిక ఇంటికి వెళ్లారు. బాలికకు వివాహం చేయటం చట్టరీత్యా నేరమని, చిన్న వయస్సులో వివాహలు చేయడం వల్ల వచ్చే అనర్థాలను బాలిక తల్లిదండ్రులకు తెలియజెప్పారు. వివాహ వయస్సు వచ్చేవరకు పెళ్లి చేయబోమని వారితో లిఖిత పూర్వక హమీ పత్రం తీసుకున్నారు.