ఆలయాల్లో కొత్త సంవత్సరం వేడుకలు వద్దు

ఆదేశాలు జారీ చేసిన ఏపీ దేవాదాయశాఖ

సాక్షి, అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఆలయాల్లో జనవరి 1న ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు చేపట్టరాదని దేవాదాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు దేవాదాయశాఖకు అనుబంధంగా పనిచేస్తున్న హిందూ ధర్మపరిరక్షణ ట్రస్టు ఆదేశాలు జారీ చేసింది. ఆంగ్లేయులు అలవాటు చేసిన నూతన సంవత్సరాదిని నిర్వహించుకోవటం భారతీయ వైదిక విధానం కాదని అందులో పేర్కొన్నారు. అందుకే కొత్త సంవత్సరం రోజున ఆలయాల్ని అలంకరించటం, స్వాగత తోరణాలు ఏర్పాటు చేయటం, శుభాకాంక్షలు తెలపడం సరికాదని దేవాదాయశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అందుకే అలాంటి కార్యక్రమాలేవీ చేయవద్దని రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు సందేశం పంపారు. భారతీయ సంప్రదాయం కానివాటి కోసం హిందూ ఆలయాల్లో డబ్బు ఖర్చు చేయడం సరికాదని అధికారుల అభిప్రాయం. తెలుగు సంవత్సరాది ప్రకారం ఉగాది రోజున మాత్రమే వేడుకలు జరపాలని దేవాదాయశాఖ కమిషనర్‌ అనురాధ సూచించారు. ఈ ఆదేశాలు తప్పనిసరిగా అమలు చేయాలని అన్ని ఆలయాల కార్యనిర్వహణాధికారులతో పాటు సహాయక కమిషనర్లు, ఉప కమిషనర్లు, మేనేజర్లకు సమాచారమిచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top