మాటలు కాదు.. మనసు చూడండి | No words .. View All | Sakshi
Sakshi News home page

మాటలు కాదు.. మనసు చూడండి

Nov 16 2013 3:51 AM | Updated on May 29 2018 4:06 PM

‘మాటలు కాదు మనసు చూడండి. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ప్రజల మధ్యలోనే ఉంటా’ అంటూ వైఎస్సార్‌సీపీ ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు.

ఆత్మకూరు, న్యూస్‌లైన్: ‘మాటలు కాదు మనసు చూడండి. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ప్రజల మధ్యలోనే ఉంటా’ అంటూ వైఎస్సార్‌సీపీ ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. ఆత్మకూరులోని పంచాయతీరాజ్ అతిథిగృహంలో శుక్రవారం ముఖ్యనేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తన కుమారుడు గౌతమ్‌రెడ్డిని అందరికీ పరిచయం చేశారు. అనంతరం గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ ఎప్పటికీ ప్రజలకు అందుబాటులోనే ఉంటానని చెప్పారు.
 
 ‘ఇది మా ఆత్మకూరు. ప్రజల మధ్యే ఉంటా. మీ మధ్యలో ఉండి నడిపిస్తాం’ అన్నారు. తాను ఎప్పుడో నియోజకవర్గానికి రా వాల్సి ఉందని, అయితే పార్టీ అధినేత కొన్ని ముఖ్యమైన పనులు అప్పగించడంతో కొంచెం ఆలస్యమైందన్నారు. ‘నేను ఎప్పటికీ మీ వాడినే’ అని అన్నారు. సొంతగడ్డకు మేలు చేయాలనే తలంపుతో రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పారు. ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తామన్నారు. మీ అందరి ఆశీర్వా దం కోసం వచ్చానని, ఆశీర్వదించాలని కోరారు.గౌతమ్‌రెడ్డి ప్రసంగం అందరిని ఆకట్టుకొంది. ఈ కార్యక్రమం మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. నెల్లూరురూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎంపీ మేకపాటిని ఆత్మకూరులో కలిశారు.
 భారీ ర్యాలీ
 తొలుత గౌతమ్‌రెడ్డి, ఎంపీ మేకపాటి, ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మురళీధర్ తదితరులు మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచి జేఆర్‌పేటలోని వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజలు నిర్వహించి అక్కడి నుంచి పట్టణంలో పాదయాత్ర నిర్వహించారు. పట్టణంలో రోడ్డు విస్తరణ పనులతో కూలిపోయిన దుకాణాలను పరిశీలించారు.
  అనంతరం దర్గాకు వెళ్లి ప్రార్థనలు నిర్వహించారు. అక్కడి నుంచి జెడ్పీ బాలికల ఉన్నతపాఠశాల సమీపంలోని వైఎస్సార్ విగ్రహం వద్దకు వెళ్లి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల కన్వీనర్లు రాపూరు వెంకటసుబ్బారెడ్డి, ఇందూరు నారసింహారెడ్డి, ఐవీ కృష్ణారెడ్డి, పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, కుమారస్వామిరెడ్డి, సంజీవులు, బండ్లమూడి అనిత, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బాలచెన్నయ్య, బాలకొండయ్య, సొసైటీ డెరైక్టర్లు దేవరపల్లి శ్రీనివాసులురెడ్డి, రఘురామిరెడ్డి, మైనార్టీ నేత ఖాజావలి, పాండురంగారెడ్డి, విజయకుమార్, స్థానిక నేతలు సూరా భాస్కర్‌రెడ్డి, పూనూరు రమేష్‌రెడ్డి, ఉల్సా పెంచలయ్య, జమీర్, గుండాల మునిరెడ్డి, జమీర్, గడ్డం శ్రీనివాసులు రెడ్డి, సర్పంచులు వేణుగోపాల్‌రెడ్డి, రఘురామిరెడ్డి పాల్గొన్నారు.
 
 హజ్రత్, అమ్మాజీలను
 దర్శించుకున్న గౌతమ్‌రెడ్డి
 అనుమసముద్రంపేట :  స్థానిక శ్రీహజ్రత్ సయ్యద్ ఖాజా రహంతుల్లా నాయబ్ రసూల్ వారిని వైఎస్సార్‌సీపీ ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి దర్శించుకున్నారు. ఆత్మకూరులో శుక్రవారం పరిచయ కార్యక్రమం అనంతరం గౌతమ్‌రెడ్డి ఏఎస్‌పేట దర్గాకు వెళ్లారు. గౌతమ్‌రెడ్డితో పాటు పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మండల కన్వీనర్ పందిళ్లపల్లి సుబ్బారెడ్డికి దర్గా సజ్జదా నషీన్ షాగులాం నక్షాబంద్ హఫీజ్ పాషా స్వాగతం పలికారు. హజ్రత్, అమ్మాజీల సమాధులపై గలేపులు, పూలచద్దర్లు వేశారు.
 
 గౌతమ్‌రెడ్డితో పాటు నాయకులకు దేవుని వస్త్రాన్ని అందజేశారు. అనంతరం స్థానిక బస్టాండ్ సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నాయకులు అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, దేవరపాటి శ్రీనివాసులురెడ్డి, అనంతసాగరం మండల కన్వీనర్ వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement