
నీరివ్వని ఎత్తిపోతలు
మెట్ట భూములకు సాగు నీరందించే లక్ష్యంతో ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా మారాయి.
నీరివ్వని ఎత్తిపోతలు
చింతకాని: మెట్ట భూములకు సాగు నీరందించే లక్ష్యంతో ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా మారాయి.
మండలంలోని మత్కేపల్లి, తిమ్మినేనిపాలెం, సీతంపేట, జగన్నాధపురం, చింతకాని, కొదుమూరు, లచ్చగూడెం, బొప్పారం గ్రామాల్లో నిర్మించిన ఎత్తిపోతల పథకాల్లో కేవలం చింతకాని, జగన్నాధపురం గ్రామాల్లోని ఎత్తిపోతల పథకాలు మాత్రమే పనిచేస్తున్నాయి. మత్కేపల్లి గ్రామంలో స్వర్ణజయంతి గ్రామస్వరాజ్గార్ యోజనలో రూ. 27.64 లక్షల వ్యయంతో 194 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు మున్నేరుపై ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు.
ఐదేళ్ల క్రితం మున్నేరుకు వచ్చిన వరదలకు పథకానికి సంబంధించిన రెండు 30 హెచ్పీ విద్యుత్ మోటార్లు, స్టార్టర్లు, మీటర్లు పూర్తిగా పాడైపోయాయి. అప్పటి నుంచి మోటార్ల మరమ్మతులకు రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికి ప్రయోజనం శూన్యం.
దీనితో ఆయక ట్టు కింది పత్తి, మొక్కజొన్న, పెసర పంటలు ఎండిపోతున్నాయి. ఎస్సీ కార్పోరేషన్ నిధులతో కొదుమూరులో సుమారు 15 ఏళ్ల క్రితం నిర్మించిన ఎత్తిపోతల పథకం ఆరేళ్లుగా పనిచేయటం లేదు. బొప్పారంలో మోటార్లు, స్టార్టర్లు కాలిపోవటమే కాకుండా షెడ్ పూర్తిగా ధ్వంసమైంది. ఏడేళ్లుగా పనిచేయటం లేదు. దీనితో ఈ పథకం ఆయకట్టు కింద ఉన్న 100 ఎకరాల్లోని పంటపోలాలు బీడు భూములుగా మారాయి. లచ్చగూడెం ఎత్తిపోతల పథకం ఐదేళ్ల నుంచి పనిచేయటం లేదు. విద్యుత్మోటార్లు, స్టార్టర్లు కాలిపోయాయి.
దీనికి తోడు పైపులైన్ కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఈ పథకం ఆయకట్టు కింద ఉన్న సుమారు వంద ఎకరాల్లోని పంటపొలాలకు నీరు అందక ఎండిపోతున్నాయని రైతులు వాపోయారు. సీతంపేట ఎత్తిపోతల పథకం ఆరేళ్లుగా పనిచేయటం లేదు. ఫలితంగా 132 ఎకరాల్లోని పంటలకు సాగునీరు అందటంలేదని ైరె తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎత్తిపోతల పథకాల మరమ్మత్తుల కోసం నీటిపారుదల కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నప్పటకి ఎవరూ పట్టించుకోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.