
జీతాల్లేవ్..!
కర్నూలు(అగ్రికల్చర్): ‘‘బాబు వస్తే.. జాబు గ్యారంటీ.. అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తాం.’’ అంటూ ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు హామీల వర్షం కురిపించారు.
కర్నూలు(అగ్రికల్చర్): ‘‘బాబు వస్తే.. జాబు గ్యారంటీ.. అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తాం.’’ అంటూ ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు హామీల వర్షం కురిపించారు. ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ భృతి కల్పిస్తామని భరోసా కూడా ఇచ్చారు. అయితే అధికారంలో వచ్చిన తరువాత సీన్ రివర్స్ అయింది. ఉద్యోగాలు ఇవ్వడం దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగులను నానా ఇబ్బందులు పెడుతున్నారు. నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా ఈ ఉద్యోగం మాకొద్దు బాబోయ్ అనేటట్లు చేస్తున్నారు. వేతనం అందక జిల్లాలో ఇటీవలే వ్యవసాయ శాఖకు చెందిన జూనియర్ అసిస్టెంట్ మురళీధర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీతాల్లేక
కర్నూలు సర్వజన వైద్యశాలలో అవుట్ సోర్సింగ్పై సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మనోహర్ గుండెపోటుతో మరణించాడు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అవుట్ సోర్సింగ్పై 160 మంది వివిధ విభాగాల్లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. వీరికి తొమ్మిది నెలలుగా జీతాలు లేవు. దీంతో వారు పడుతున్న ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. ఈ ఏడాది జనవరి నెలలో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేసే 96 మంది పంచాయతీ సెక్రటరీలను రెగ్యులర్ చేశారు. రెగ్యులర్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు వారికి వేతనాలు అందలేదు. రెగ్యులర్ అయ్యామనే సంతోషం వారిలో కరువైంది. సాంఘిక సంక్షేమ శాఖలో అవుట్ సోర్సింగ్పై 110 మంది అటెండర్లు, వాచ్మెన్లు, కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. వీరికి ఫిబ్రవరి నెల నుంచి జీతాలు లేవు. బీసీ సంక్షేమ శాఖలో 94 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఇదే పరిస్థితి ఎదురైంది. జూన్ నుంచి వేతనాలు లేకపోవడంతో వారు అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోంది. జూనియర్ కళాశాలల్లో దాదాపు 300 మంది కాంట్రాక్టు పద్ధతిపై లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. వీరికి జూన్ నుంచి పైసా ఇవ్వలేదు. వీరు ఇంటి బాడుగలు చెల్లించలేక ఇబ్బందులు పడతున్నారు. కర్నూలు నగరపాలక సంస్థకు సంబంధించిన పార్కుల్లో అవుట్ సోర్సింగ్పై పనిచేస్తున్న 30 మంది మూడు నెలలుగా జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. కర్నూలు మండలంలోని స్టాంటన్పురం, మునగాలపాడు, మామిదాలపాడు పంచాయతీలను కొన్ని నెలల క్రితం కర్నూలు నగరపాలక సంస్థలో విలీనం చేశారు. ఈ గ్రామాల్లో 40 మంది అవుట్ సోర్సింగ్పై పనిచేస్తున్నారు. వీరికి ఆరు నెలలుగా వేతనాలు లేవు. రెవెన్యూ శాఖలో 13 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అవస్థలు చెప్పనలవి కాదు. వీరికి జూన్ నుంచి జీతాలు లేవు. ఐకేపీలో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న యానిమేటర్లకు 15 నెలలుగా జీతాల్లేవు. అవుట సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించకుండా అలసత్వం వహిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. రెగ్యులర్ ఉద్యోగుల తరహాలో ప్రతినెలా క్రమం తప్పకుండా జీతాలు ఇవ్వాలని కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు.