the job
-
హత్య కేసులో ఆరుగురి అరెస్టు
మడికొండ : హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు కాజీపేట డీఎస్పీ జనార్దన్, మడికొండ సీఐ డేవిడ్రాజ్ తెలిపారు. పోలీస్స్టేషన్లో బుధవారం నిందితుల వివరాలను వారు వెల్లడించారు. కరీనంగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన రౌతు రాంచందర్ రైల్వేలో పనిచేసి వలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆయనకు రవి, సతీష్ కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రాంచందర్ తన ఉద్యోగాన్ని సతీష్కు ఇవ్వడానికి అంగీకరించాడు. అనంతరం రాంచందర్ మృతిచెందాడు. ఈ క్రమంలో తండ్రి ఉద్యోగాన్ని తమ్ముడు సతీష్కు ఇవ్వడానికి ఇష్టపడని రవి.. తన చెల్లి రాణికి వచ్చే విధంగా చేశాడు. గతంలోనూ ఉద్యోగ విషయమై రవిపై సతీష్ కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో పెద్దపల్లిలో నివాసం ఉంటున్న సతీష్ అక్కడ ఆయనకు దైత సన్నీతేజతో పరిచయం ఏర్పడింది. తన అన్నను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని సన్నీతేజకు సతీష్ చెప్పాడు. విషయాన్ని సన్నీతేజ భీమారంలో ఉంటున్న తన బంధువు జన్ను వరుణ్రాజ్కు తెలిపాడు. వరుణ్రాజ్ హన్మకొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇద్దరు కలిసి రౌతు రమేష్ను చంపేందుకు రూ.లక్షన్నరకు బేరం కుదుర్చుకున్నారు. పథకం ప్రకారం సతీష్ ముందుగానే కడిపికొండలోని బంధువుల వద్దకు వచ్చాడు. పార్టీకి రావాలని జనవరి 14న తన అన్నకు సతీష్ ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ముందుగానే ప్లాన్ వేసుకున్న సన్నీతేజ, వరుణ్రాజ్ మద్యం బాటిళ్లను కొనుగోలు చేసుకుని మడికొండ శివారులోని ఎల్లమ్మ గుడి సమీపంలో కూర్చున్నారు. అదే సమయంలో వరుణ్రాజ్ తన స్నేహితులు గట్టు క్రాంతికుమార్, ఆరిఫ్ (ఇంజినీరింగ్ విద్యార్థి), సునీల్ను సైతం పార్టీ చేసుకుందామని ఫోన్ చేసి రప్పించాడు. అయితే రాత్రి కావడంతో క్రాంతికుమార్, ఆరిఫ్, సునీల్ను పంపించి వేశారు. రౌతు రవికి మద్యం ఎక్కువగా తాగించి పథకం ప్రకారం కత్తితో పొడిచారు. కింద పడి లేవడానికి ప్రయత్నిస్తుండగా మద్యం బాటిల్ను తలపై బలంగా కొట్టడంతో రవి చనిపోయాడు. అనంతరం రౌతు సతీష్, సన్నీతేజ, వరుణ్రాజ్ రాత్రికి రాత్రే హైదరాబాద్కు వెళ్లారు. ఉదయం సతీష్ ఎంజీఎం ఆస్పత్రికి వచ్చి తన అన్నను అక్క, బావ చంపి ఉంటారని పోలీసులను పక్కదారి పట్టించే ప్లాన్ చేశాడు. కానీ, క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్ ఆధారంగా దొరుకుతామని భావించిన సతీష్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. సతీష్ తెలిపిన వివరాల ప్రకారం ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రూ.50 వేల నగదు, కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ, సీఐ తెలిపారు. విద్యార్థులు భవిష్యత్ను నాశనం చేసుకోవద్దు.. చదువుకునే సమయంలో విద్యార్థులు జల్సాలకు అలవాటు పడి భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని కాజీపేట డీఎస్సీ జనార్దన్ అన్నారు. హత్య జరిగే ముందు మద్యం తాగడానికి వచ్చిన వారిలో ఒకరు ఇంజినీరింగ్ విద్యార్థి, మరొకరు డిగ్రీ విద్యార్థి ఉన్నారని తెలిపారు. యువకులు భవిష్యత్కు బాటలు వేసుకోవాలని ఆయన సూచించారు. -
జీతాల్లేవ్..!
కర్నూలు(అగ్రికల్చర్): ‘‘బాబు వస్తే.. జాబు గ్యారంటీ.. అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తాం.’’ అంటూ ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు హామీల వర్షం కురిపించారు. ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ భృతి కల్పిస్తామని భరోసా కూడా ఇచ్చారు. అయితే అధికారంలో వచ్చిన తరువాత సీన్ రివర్స్ అయింది. ఉద్యోగాలు ఇవ్వడం దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగులను నానా ఇబ్బందులు పెడుతున్నారు. నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా ఈ ఉద్యోగం మాకొద్దు బాబోయ్ అనేటట్లు చేస్తున్నారు. వేతనం అందక జిల్లాలో ఇటీవలే వ్యవసాయ శాఖకు చెందిన జూనియర్ అసిస్టెంట్ మురళీధర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీతాల్లేక కర్నూలు సర్వజన వైద్యశాలలో అవుట్ సోర్సింగ్పై సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మనోహర్ గుండెపోటుతో మరణించాడు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అవుట్ సోర్సింగ్పై 160 మంది వివిధ విభాగాల్లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. వీరికి తొమ్మిది నెలలుగా జీతాలు లేవు. దీంతో వారు పడుతున్న ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. ఈ ఏడాది జనవరి నెలలో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేసే 96 మంది పంచాయతీ సెక్రటరీలను రెగ్యులర్ చేశారు. రెగ్యులర్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు వారికి వేతనాలు అందలేదు. రెగ్యులర్ అయ్యామనే సంతోషం వారిలో కరువైంది. సాంఘిక సంక్షేమ శాఖలో అవుట్ సోర్సింగ్పై 110 మంది అటెండర్లు, వాచ్మెన్లు, కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. వీరికి ఫిబ్రవరి నెల నుంచి జీతాలు లేవు. బీసీ సంక్షేమ శాఖలో 94 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఇదే పరిస్థితి ఎదురైంది. జూన్ నుంచి వేతనాలు లేకపోవడంతో వారు అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోంది. జూనియర్ కళాశాలల్లో దాదాపు 300 మంది కాంట్రాక్టు పద్ధతిపై లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. వీరికి జూన్ నుంచి పైసా ఇవ్వలేదు. వీరు ఇంటి బాడుగలు చెల్లించలేక ఇబ్బందులు పడతున్నారు. కర్నూలు నగరపాలక సంస్థకు సంబంధించిన పార్కుల్లో అవుట్ సోర్సింగ్పై పనిచేస్తున్న 30 మంది మూడు నెలలుగా జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. కర్నూలు మండలంలోని స్టాంటన్పురం, మునగాలపాడు, మామిదాలపాడు పంచాయతీలను కొన్ని నెలల క్రితం కర్నూలు నగరపాలక సంస్థలో విలీనం చేశారు. ఈ గ్రామాల్లో 40 మంది అవుట్ సోర్సింగ్పై పనిచేస్తున్నారు. వీరికి ఆరు నెలలుగా వేతనాలు లేవు. రెవెన్యూ శాఖలో 13 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అవస్థలు చెప్పనలవి కాదు. వీరికి జూన్ నుంచి జీతాలు లేవు. ఐకేపీలో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న యానిమేటర్లకు 15 నెలలుగా జీతాల్లేవు. అవుట సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించకుండా అలసత్వం వహిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. రెగ్యులర్ ఉద్యోగుల తరహాలో ప్రతినెలా క్రమం తప్పకుండా జీతాలు ఇవ్వాలని కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు.