అయ్యో పాపం | newly born child died in chittoor urban | Sakshi
Sakshi News home page

అయ్యో పాపం

Feb 11 2015 12:42 AM | Updated on Sep 28 2018 3:39 PM

అప్పుడే తల్లిపేగు తెంచుకుని పుట్టినట్లు.. బొడ్డుపై రక్తపు మరకలు ఆరకుండా.. పండంటి మగబిడ్డ.. ఏమయ్యిందో ఏమో.. ఓ కుక్క ఈ పసిగుడ్డును నోటికి కరుచుకుని వీధు ల్లో తిరుగుతూ కనిపించింది.

- చిత్తూరులో పురిటిబిడ్డ కలకలం!
- కుక్క తీసుకొచ్చి రోడ్డుపై పడేసిన వైనం
- భూణహత్యా..? మృతశిశువా..?
- ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు

 
చిత్తూరు (అర్బన్): అప్పుడే తల్లిపేగు తెంచుకుని పుట్టినట్లు.. బొడ్డుపై రక్తపు మరకలు ఆరకుండా.. పండంటి మగబిడ్డ.. ఏమయ్యిందో ఏమో.. ఓ కుక్క ఈ పసిగుడ్డును నోటికి కరుచుకుని వీధు ల్లో తిరుగుతూ కనిపించింది. స్థానికులు గదమాయించడంతో బిడ్డను పడేసి వెళ్లిపోయింది. చిత్తూరు నగరంలో మంగళవారం ఈ సంఘటన చూసిన ప్రజలు చలించిపోయారు.
 
చిత్తూరు నగరంలోని సుందరయ్యవీధిలో ఓ పసికందును వీధి కుక్క నోటి తో పట్టుకుని పరుగెడుతూ కనిపిం చింది. అప్పటికే శిశువు శరీరం నుంచి రక్తం ధారలా కారుతోంది. చలించిపోయిన స్థానికులు కుక్కను బెదిరించడంతో అది శిశువును రోడ్డుపై వదిలి వెళ్లిపోయింది. అప్పటికే పసికందు మృతి చెందాడు. విషయాన్ని స్థానికులు చిత్తూరు పోలీసులకు తెలియజేశారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ లక్ష్మీనాయుడు, ఎస్‌ఐ లక్ష్మీకాంత్‌లు సమీపంలో ఉన్న ఆస్పత్రి వైద్యుల్ని ప్రశ్నించారు. ఎలాంటి సమాచారం అందలేదు. శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
 
ఎవరు చేశారో?
ఈ సంఘటన పలు అనుమానాలకు దారితీస్తోంది. నిజంగా ఆస్పత్రిలో బిడ్డను ప్రసవిస్తే పడకపై ఉన్న శిశువును కుక్క ఎత్తుకెళ్లే ప్రసక్తేలేదు. అలా కుక్క ఎత్తుకెళ్లిందని అనుకున్నా శిశువు కనిపించలేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండాలి. కానీ ఎవరూ శిశువు కనిపించలేదని ఫిర్యాదు ఇవ్వలేదు. దీంతో ఇది భ్రూణహత్యగా పోలీసులు భావిస్తున్నారు. తల్లితనాన్ని వద్దనుకున్నవారెవరైనా ప్రైవేటు ఆస్పత్రిలో అబార్షన్ చేసుకుని మృతదేహాన్ని చెత్త కుప్పలో పడేశారా.. అనేదానిపై అనుమానం వ్యక్త మవుతోంది. అయితే శిశువును చూస్తే పూర్తిగా నెలలు నిండినట్లు కనిపిస్తోంది.
 
 
నెలలు నిండిన శిశువును చేజేతులా ఎవరూ చంపుకోలేరు. కాన్పు జరిగే సమయంలో గర్భంలోనే బిడ్డ చనిపోయిందా అనే అనుమానం కూడా వ్యక్త మవుతోంది. అయితే ఈ సంఘటనలో ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకుల నిర్లక్ష్యం మాత్రం ప్రస్ఫూటంగా కనిపిస్తోంది. మృతశిశువైనా దాన్ని ఖననం చేయాలే తప్ప ఇలా రోడ్లపై, చెత్త కుప్పలో వేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. చిత్తూరు నగరంలో అబార్షన్లకు పేరొందిన పలు ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకుల్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వాస్తవాలు ఆధారపడ్డాయని పోలీసులు చెబుతున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement