‘నారాయణ’ విద్యార్థి ఆత్మహత్య | narayana college student suicide in gannavaram | Sakshi
Sakshi News home page

చితకబాదిన అధ్యాపకులు.. నారాయణ విద్యార్థి ఆత్మహత్య

Sep 18 2017 2:00 AM | Updated on Nov 9 2018 5:02 PM

‘నారాయణ’ విద్యార్థి ఆత్మహత్య - Sakshi

‘నారాయణ’ విద్యార్థి ఆత్మహత్య

ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్న ఈశ్వర్‌ రెడ్డి అనే విద్యార్థి కాలేజీ భవనంపై నుంచి కిందకు దూకడంతో మృతిచెందాడు.

గన్నవరం: ర్యాంకుల కోసం సాగిస్తున్న వేధింపులకు నారాయణ కాలేజీలో మరో విద్యార్థి బలయ్యాడు. వారాంతపు పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని అధ్యాపకులు చితకబాదడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా గూడవల్లిలోని నారాయణ క్యాంపస్‌లో ఆదివారం ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. విద్యార్థుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా రెంటచింతల మండలం మంచికల్లుకు చెందిన పి.ఈశ్వర్‌రెడ్డి(15) గూడవల్లి నారాయణ క్యాంపస్‌లో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం జరిగిన వారంతపు పరీక్షల్లో ఈశ్వర్‌రెడ్డికి తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో విద్యార్థులందరి ముందు ఈశ్వర్‌రెడ్డిని అధ్యాపకులు తీవ్రంగా కొట్టారు.

మనస్తాపానికి గురైన ఈశ్వర్‌రెడ్డి మధ్యాహ్నం క్లాస్‌కు వెళ్లకుండా హాస్టల్‌ గదిలోనే ఉండిపోయాడు. సాయంత్రం రూమ్‌కి తిరిగివచ్చిన సహచర విద్యార్థులు.. ఫ్యాన్‌కు వేలాడుతున్న ఈశ్వర్‌రెడ్డిని గుర్తించి వెంటనే అధ్యాపకులకు సమాచారమిచ్చారు. చికిత్స కోసమంటూ వారు అతణ్ణి ఎనికేపాడు సమీపంలోని కామినేని ఆస్పత్రికి తరలించారు.

కానీ అప్పటికే ఈశ్వర్‌రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మంత్రి నారాయణకు చెందిన కాలేజీ కావడంతో ఈ విషయం బయటకు రాకుండా సిబ్బంది గోప్యత పాటించారు. కనీసం విద్యార్థి తల్లిదండ్రులకు కూడా ఆదివారం రాత్రి వరకు సమాచారమివ్వలేదు. ప్రమాదవశాత్తూ భవనంపై నుంచి పడినట్లుగా వారికి వివరించారు. కానీ సహచర విద్యార్థులను మీడియా ఆరా తీయగా.. ఈశ్వర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తేలింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విద్యార్థుల నుంచి ప్రాథమిక సమాచారం సేకరించారు. కాగా, విషయం తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాలు కామినేని ఆస్పత్రికి చేరుకుని ఆందోళన నిర్వహించాయి.  

Advertisement
 
Advertisement
Advertisement