
ఏయూ గేటు వద్ద కేక్ కట్చేసి బాలికకు తినిపిస్తున్న ఎమ్మెల్యే అనిత
ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రాజకీయ రంగు పులుముతున్నారు.
వర్సిటీలో నారా లోకేశ్ పుట్టినరోజు వేడుకలు
టపాసులు కాల్చి హంగామా చేసిన టీఎన్ఎస్ఎఫ్
చోద్యం చూసిన అధికారులు
నాడు ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొన్న వారికి మాత్రం వేధింపులు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రాజకీయ రంగు పులుముతున్నారు. వర్సిటీని పసుపుమయం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్ పుట్టినరోజు వేడుకలను టీఎన్ఎస్ఎఫ్ నాయకులు వర్సిటీ ప్రవేశ మార్గం వద్ద టపాసులు కాల్చుతూ ఘనంగా నిర్వహించారు. వర్సిటీ ప్రవేశ మార్గానికి ఇరువైపులా లోకేశ్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి.. వర్సిటీ ప్రవేశ మార్గాన్ని మూసివేస్తూ కటౌట్లు ఏర్పాటు చేస్తుంటే వర్సిటీ పాలకులు చోద్యం చూశారు.
అనుమతి లేనిదే టపాసులు కాలిస్తే అనవసర రాద్ధాంతం చేసే పోలీసులు.. వర్సిటీ ప్రవేశ మార్గం వద్ద టపాసులు కాలుస్తున్నా మిన్నకుండిపోయారు. ఈ కార్యక్రమానికి పాయకరావుపేట ఎమ్మెల్యే వి.అనిత హాజరై కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కొందరు వర్సిటీ ఉద్యోగులు స్వయంగా పాల్గొని తమ స్వామి భక్తిని చాటుకునే ప్రయత్నం చేశారనే విమర్శలు వినిపించాయి.
కాగా, మరో పార్టీ నాయకులు ఇలా చేస్తే పోలీసులు ఊరుకుంటారా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ప్రశాంతంగా ఉండాల్సిన వర్సిటీ పరిసరాలలో టపాసులు కాల్చడం, రాజకీయ నాయకుల పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ వైఎస్ఆర్సీపీ ఉద్యమిస్తే.. ఆ ఉద్యమంలో పాల్గొన్న వారిని పాలకులు నానా ఇబ్బందులకు గురిచేశారని పలువురు విద్యార్థులు గుర్తు చేస్తున్నారు. వైఎస్ జగన్ నిర్వహించిన సదస్సులకు విద్యార్థులు తరలి వస్తుంటే బస్సులను అడ్డుకోవడం, సదస్సులో పాల్గొన్నారని ఏకంగా ఓ ప్రొఫెసర్ను సస్పెండ్ చేయడం.. ప్రజలెవ్వరూ మరచిపోలేదని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్ కోసం మాట్లాడితే ఒక విధంగా, పాలకులపై స్వామి భక్తి ప్రదర్శిస్తే మరొక విధంగా వ్యవహరించడం దారుణం అని మండిపడ్డారు.