చేతకాకపోతే తప్పుకోండి | Naidu leaves CM seat: Parthasarathy | Sakshi
Sakshi News home page

చేతకాకపోతే తప్పుకోండి

Jan 8 2018 5:41 PM | Updated on Aug 27 2018 8:31 PM

సాక్షి, విజయవాడ: రైతులకు న్యాయం చేయలేకపోతే గద్దె దిగండి.. మీకంటే చక్కగా పాలించే వారు చాలామంది ఉన్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి సీఎం చంద్రబాబుకు చురకలంటించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైతును రాష్ట్రానికి రాజుగా చేద్దామని నినాదాలు చేస్తున్నారు.. నిజానికి రైతులను రోడ్డుపాలు చేస్తున్నారని విమర్శించారు. ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయారన్నారు. రూ.5వేల కోట్ల తో ధరల స్థిరీకరణ అన్నారు.. రూ.85 వేల కోట్లు రుణమాఫీ చేస్తామన్నారు.. నాలుగేళ్లు గడుస్తున్నా రూ.12 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ అన్నారు.. కనీసం అవికూడా చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. 

రాష్ట్రంలో చంద్రబాబు రైతులను రుణగ్రస్తులను చేశారని, సహకార సొసైటీలను తెలుగు తమ్ముళ్లు అవినీతిమయం చేశారని ఆయన విమర్శించారు. రైతుల పేరుతో మిల్లులకు ధాన్యం అమ్మినట్లు తప్పుడు లెక్కలు చూపుతున్నారని, కోట్ల రూపాయల మేర మిల్లర్లతో కలిసి జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. రేషన్ బియ్యాన్ని మిల్లర్లు రీసైకిల్ చేసి తిరిగి ప్రభుత్వానికే లెవీగా ఇస్తున్నారన్నారు. ఈ అక్రమార్కులకు మంత్రులే అండగా నిలుస్తున్నారని, కృష్ణాజిల్లా ముస్తాబాద్ సొసైటీలో జరిగిన అవినీతే ఇందుకు నిదర్శనమని పార్థసారథి అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement