రైతుల చేతికి పైసా ఇవ్వకుండా రుణమాఫీతో మాయాజాలం ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు....
అనంతపురం అగ్రికల్చర్: రైతుల చేతికి పైసా ఇవ్వకుండా రుణమాఫీతో మాయాజాలం ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చివరకు రైతుద్రోహిగా మిగిలిపోవడం ఖాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు కె.వెంకటచౌదరి అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... విజన్ 2029 పేరుతో నవ్యాంధ్ర చేస్తానని, సింగపూర్ను తలపించేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ చంద్రబాబునాయుడు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని మండిపడ్డారు.
వర్షాలు లేక, పంటలు పండక, ఇన్పుట్, ఇన్సూరెన్స్ అందక, రుణాలు మాఫీ కాక, కొత్త రుణాలు తీసుకోలేక... ఒకటేమిటి చంద్రబాబు హామీలు నమ్మి రైతులు దారుణంగా మోసపోయారన్నారు. వ్యవసాయానికి సంబంధించి అన్ని రకాల రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు చివరకు పంట రుణాలు, బంగారు రుణాలు రూ.లక్షన్నర వరకు మాఫీ చేస్తానని నమ్మబలికారన్నారు. కానీ... అధికారం చేపట్టి ఎనిమిది నెలలు గడుస్తున్నా రుణమాఫీ అమలు చేయడంలో దారుణంగా విఫలమయ్యారని విమర్శించారు.
జిల్లాలో రూ.4,944 కోట్లు మేర పంట, బంగారు రుణాలు ఉంటే అందులో తొలివిడతగా కేవలం రూ.780 కోట్లు మాఫీలోకి చేర్చడంతో రైతులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. మిగతా రైతుల రుణాలు ఎలా మాఫీ చేస్తారో తక్కిన అప్పులు ఎలా రద్దు చేస్తారో చంద్రబాబుకే అర్థంకాని పరిస్థితి నెలకొందన్నారు. చేసిన మాఫీ చివరకు వడ్డీకి కూడా సరిపోయే పరిస్థితి లేదన్నారు. వ్యవసాయం, పాడి, పండ్లతోటలకు సంబంధించిన పథకాలు పూర్తీగా పడకేశాయన్నా రు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తరువాతనే 50 మంది దాకా రైతులు బలన్మర ణం చెందారని, వారి కు టుంబాలు అనాథలుగా మారిపోయాయన్నారు.
బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే బ్యాం కుల్లో ఉన్న బంగారు రుణాలు వేలం వేయడానికి బ్యాంకర్లు నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు చాలా బ్యాంకుల్లో బంగారు వేలాలు ఉన్నాయన్నారు. వాటిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అడ్డుకుంటుందని హెచ్చరించారు.
సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయాన్ని రైతుపక్షపాతిగా గట్టెక్కించిన ఘతన దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డికే దక్కుతుందన్నారు. భారీ రాయితీలు, ప్రోత్సాహకాలు, పథకాలు అమలు చేసి అన్నదాత ఇంట సంతోషం నింపారన్నారు. సమావేశంలో రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి యూపీ నాగిరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరశురాం, పార్టీ యూత్ నగర కమిటీ అధ్యక్షుడు మారుతీనాయుడు తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు, రైతు ద్రోహి, కె.వెంకటచౌదరి,
Naidu, a farmer mole, k venkatachaudari