‘నాడు – నేడు’పై మన కల నిజం కావాలి: సీఎం జగన్‌

Nadu Nedu Program Is Most Priority To Government Says CM YS Jagan - Sakshi

నాడు–నేడు ప్రభుత్వానికి టాప్‌ ప్రయార్టీ

మొదటి విడత నాడు–నేడులో 15 వేల స్కూళ్లలో అభివృద్ధి

దీని కోసం దాదాపు రూ.3600 కోట్లు ఖర్చు

మొత్తం రూ.4,456 కోట్లతో మారుమూల గ్రామాలకు రోడ్లు

పలు సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష

సాక్షి, తాడేపల్లి : ఏడాదిన్నరలోగా విద్యారంగంలో నాడు-నేడు పనులు పూర్తి కావాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు, సాగునీటి ప్రాజెక్టులు, వాటర్‌గ్రిడ్, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు నిధుల అనుసంధానంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్న వీటి విషయంలో ఎక్కడా నిధులకు కొరత రాకుండా పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. నిధుల అనుసంధానంపై నిర్దిష్ట సమయంతో లక్ష్యాలను పెట్టుకుని ఖచ్చితమైన ప్రణాళికతో అడుగులు ముందుకేయాలని స్పష్టం చేశారు. నిర్ణీత సమయంలోగా లక్ష్యాలు, అంతే వేగంతో పనులు జరగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నాడు-నేడు కార్యక్రమం ప్రభుత్వానికి అత్యంత ప్రధానమని వైఎస్‌ జగన్‌ అన్నారు. (కరోనా: ‘ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు’) 

విద్యారంగంలో నాడు-నేడు
విద్యారంగంలో నాడు-నేడు పనులకు ఇప్పటి వరకు విడుదల చేసిన నిధులు, ఇకపై సమీకరించాల్సిన నిధుల అంశాలపై సీఎం అధికారులకు మార్గనిర్దేశం చేశారు. మొదటి విడత నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా 15 వేలకు పైగా స్కూళ్లలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, దీని కోసం దాదాపు రూ.3600 కోట్లు ఖర్చు అవుతుందని, ఇప్పటికి రూ.920 కోట్లు విడుదలయ్యాయని వెల్లడించారు. మిగిలిన నిధుల విడుదల కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 నాటికి మొదటి విడత నాడు–నేడు కార్యక్రమాలకు మిగిలిన నిధులు ఇచ్చేందుకు ప్రణాళిక వేసుకోవాలన్నారు. అలాగే పాఠశాలలు సహా, హాస్టళ్లు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో రెండు, మూడో విడత నాడు–నేడు కార్యక్రమాల కోసం రూ.7700 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశామని అధికారులు సీఎంకు తెలిపారు. (సున్నా వడ్డీ సొమ్ము నేరుగా రైతులకే)

ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్న పాఠశాలలు, ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమాలకు.. నిధుల పరంగా ఇబ్బందులు రాకుండా, పటిష్టంగా ఈ కార్యక్రమం కొనసాగాలని వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఏడాదిన్నర కాలంలో పాఠశాలల అభివృద్ధి విషయంలో మనం కన్న కలలు నిజం కావాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. విద్యారంగంలో నాడు-నేడు పనులపై తాము కన్న కల నిజం కావాలని అధికారులకు ముఖ్యమంతి సూచించారు. ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీల్లో కూడా నాడు-నేడు, కొత్తగా నిర్మించే నిర్మాణాలు అత్యంత ముఖ్యమైనదన్నారు. అక్టోబర్‌ 1 నుంచి రాయలసీమ కరువు నివారణా పనులు ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. (సున్నా వడ్డీ సొమ్ము నేరుగా రైతులకే)

వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు :
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ రక్షిత తాగునీటిని అందించే ప్రయత్నాల్లో భాగంగా వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. తొలిదశలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, తూ.గో, ప.గో, గుంటూరులోని పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతం, చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం, కడప జిల్లాలో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకోసం రూ.19,088 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. దీనికి సంబంధించి నిధుల అనుసంధానంపై వైఎస్‌ జగన్‌కు వివరించారు. నిధుల సమీకరణ టై అప్‌ జరిగిందని తెలిపారు. వీటితోపాటు కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలోని 7 నియోజకవర్గాలతో పాటు, డోన్‌ నియోజకవర్గంలో కూడా వాటర్‌ గ్రిడ్‌ చేపట్టాలని జగన్‌ ఆదేశించారు. ప్రకాశం జిల్లాలోని మిగిలిన పశ్చిమ ప్రాంతంలోనూ, అనంతపురం జిల్లాలోనూ వాటర్‌ గ్రిడ్‌ పనులు చేపట్టాలని సీఎం అన్నారు. వీటికి సంబంధించి డీపీఆర్‌లు సిద్ధంచేసి టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. హైబ్రీడ్‌ యాన్యునిటీ (హెచ్‌.ఎ.ఎం.) విధానంలో చేపడుతున్న వాటర్‌ గ్రిడ్‌ పనులకు అక్టోబరు టెండర్లు ఖరారు చేస్తామని, ఆవెంటనే వర్క్‌ ఆర్డర్లు ఇస్తామని అధికారులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు తెలిపారు.

వైద్యం – ఆరోగ్య రంగం:
►16 కొత్త మెడికల్‌ కాలేజీలు, 1 సూపర్‌ స్పెషాల్టీ, 1 క్యాన్సర్‌ ఆస్పత్రి, 1 మానసిక చికిత్సాసుపత్రి కోసం రూ. 6657 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా
► అలాగే ప్రస్తుతం ఉన్న 11 ఆస్పత్రులు, 6 అనుంబంధ సంస్థలు, 7 మల్టీ సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రుల కోసం మరో రూ.6099 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా
►ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమాల కోసం రూ.1,236 కోట్లు ఖర్చు 
►అలాగే పీహెచ్‌సీల్లో కొత్త వాటి నిర్మాణం, ఉన్న వాటి పునరుద్ధరణ కోసం రూ.671 కోట్లు ఖర్చు కాగలదని అంచనా
►విలేజ్‌ క్లినిక్స్‌లో 11,197 కేంద్రాల పునరుద్ధరణ మరియు కొత్త వాటి నిర్మాణం కోసం రూ.1745 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశారు. 
►వీటికి నిధుల అనుసంధానంపైనా సీఎం అధికారులతో చర్చించారు. 
► ఇప్పటికే నిధులు సమకూరిన వాటి పనులు వేగవంతం చేయాలని, మిగతా వాటికి నిధులు అనుసంధానం చేసుకుని ప్రణాళికతో ముందుకుసాగాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. 

సాగునీటి ప్రాజెక్టులు:
రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న, చేపట్టబోయే ప్రాజెక్టుల కోసం దాదాపు రూ.98 వేల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. వీటిలో రూ.72 వేల కోట్ల కొత్త ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయన్నారు. రాయలసీమ ప్రాంతంలో  కరువు నివారణ కోసం ఉద్దేశించిన పనుల కోసం ఖర్చు చేసే నిధుల కోసం ఆర్థిక సంస్థలు, బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నామని, త్వరలో దీనికి సంబంధించి ఫైనాన్షియల్‌ క్లోజర్‌ పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబరు 1 నుంచి రాయలసీమ కరువు నివారణ పనులు ప్రారంభం కావాలని, టెండర్లు వీలైనంత త్వరగా ఖరారు చేయాలని సీఎం ఆదేశించారు. రాయలసీమ కరువు నివారణ పనులతో పాటు, స్టేట్‌ వాటర్‌ సెక్యూరిటీ డెవలప్‌మెంట్‌ (పోలవరం చేపట్టాల్సిన  నుంచి వరద జలాల తరలింపు), ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పల్నాడు ప్రాంతంలో కరువు నివారణ–తాగునీటి వసతి కల్పన, కృష్ణా–కొల్లేరు ప్రాంతం ఉప్పు నీటిమయం కాకుండా పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. 

ఏఐఐబీ ఆర్థిక సహాయం చేస్తోంది
పంచాయతీ రాజ్‌ విభాగంలో కొనసాగుతున్న రోడ్ల నిర్మాణ పనులపైనా ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. దీనికి ఏఐఐబీ ఆర్థిక సహాయం చేస్తోందని, మొత్తం రూ.4,456 కోట్లతో మారుమూల గ్రామాలకు రోడ్లను వేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 70శాతం టెండర్లు ఖరారై పనులు కొనసాగుతున్నాయని, మిగిలిన 30శాతం పనులకు త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తామని చెప్పారు. రూ.5,350 కోట్లతో చేపడుతున్న కార్యక్రమాల పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. ఏఐఐబీతో నిధుల అనుసంధానం జరిగిందని అధికారులు వెల్లడించారు. రెండు ప్యాకేజీలకు సంబంధించి, రూ.1950 కోట్ల విలువైన పనులకు త్వరలోనే టెండర్లు ఖరారుచేస్తామన్నారు. ఏఐఐబీ దీనికి నిధులు సమకూరుస్తోందని తెలిపారు. రోడ్లు–భవనాల శాఖలో భాగంగా ‘న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు’తో చేపట్టిన ప్రాజెక్టుల తొలిదశలో భాగంగా దాదాపు రూ.3200 కోట్లను దీని కోసం ఖర్చు చేస్తున్నారు. దీంట్లో భాగంగా 3,104 కి.మీ రహదారులు, 479 బ్రిడ్జిలు నిర్మించనున్నారు. మొదటి విడత పనులకు సంబంధించి 50శాతం డీపీఆర్‌లు తయారు అయ్యాయని, మిగిలినవి కూడా పూర్తవుతాయని తెలిపారు.  వీటికీ టెండర్లు ఖరారుచేస్తామని అధికారులు వెల్లడించారు. 

ముఖ్యమంతి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ నీలం సాహ్ని, ఆర్థిక, విద్య, వైద్య, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆర్‌అండ్‌బీ, జలవనరులశాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top