విభజన సూత్రధారి చంద్రబాబే | N Prasanna kumar Reddy takes on Chandra babu | Sakshi
Sakshi News home page

విభజన సూత్రధారి చంద్రబాబే

Feb 18 2014 5:33 AM | Updated on Jul 28 2018 6:33 PM

రాష్ట్ర విభజనకు సూత్రధారి, కాంగ్రెస్‌తో కుమ్మక్కై ఆజ్యం పోసింది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడేనని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి దుయ్యబట్టారు.

బాబుకు మతి భ్రమించింది
 ప్రజా కోర్టులో బాబు మళ్లీ దోషిగా నిలబడతాడు  
 కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి

 
 కోవూరు, న్యూస్‌లైన్ :  రాష్ట్ర విభజనకు సూత్రధారి, కాంగ్రెస్‌తో కుమ్మక్కై ఆజ్యం పోసింది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడేనని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. బాబు ఇచ్చిన లేఖ కారణంగానే సోనియాగాంధీ రాష్ట్ర విభజనకు ధైర్యం చేసిందన్నారు. సోమవారం మండలంలోని పాటూరు అరుంధతీయవాడలో పార్టీ నేత మణి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైన విషయం ప్రజలకు ఎక్కడ పూర్తిస్థాయిలో అర్థమవుతుందోనని భయపడి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై రుద్దేందుకు నానా తంటాలు పడుతున్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో జాతీయ నాయకులతో రాష్ట్ర విభజనకు సహకరించాలని కోరుతున్నారని బాబు నిస్సిగ్గుగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 25 సీట్లు వస్తాయని, మీకు సహకరిస్తామని జగన్ చెబుతున్నారంటూ చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇప్పటికే రెండుసార్లు చంద్రబాబును ఛీకొట్టినా.. ఆయన బుద్ధి మారలేదన్నారు. ఆల్‌ఫ్రీ బాబుగా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పౌరుషానికి ప్రతీక అయిన రాయలసీమలో పుట్టి సీమ పరువును తీస్తున్నారన్నారు. రాష్ర్టం సమైక్యత కోసం ఆది నుంచి పోరాడుతుంది.. జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే అన్నారు. సమైక్యత కోసం జగన్ జైలులో ఉండి కూడా ఆమరణ దీక్ష చేశారన్నారు. వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు  విజయమ్మ, షర్మిల పాదయాత్రతో సమైక్యాంధ్ర కోసం ఎన్నో ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారన్నారు. విజయమ్మతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా ఆమరణ దీక్షలు చేపట్టామన్నారు.  

 వైఎస్సార్ హయాంలో  రాష్ట్రం వైపు చూడని కేంద్రం

 మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రం వైపు కనీసం కన్నెత్తి చూసేందుకు కూడా ధైర్యం చేయని సోనియాగాంధీ ఆయన మరణానంతరం రాష్ట్రాన్ని  విభజించేందుకు పూనుకుందన్నారు. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీతో కుమ్మకై డ్రామాలు ఆడిన సంగతి ఎవరనేది రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. మరో మారు చంద్రబాబును ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టడం ఖాయమన్నారు. కార్యక్రమంలో కోవూరు, ఇందుకూరుపేట మండలాల కన్వీనర్లు మూలుమూడి వినోద్‌కుమార్‌రెడ్డి, మావులూరు శ్రీనివాసులురెడ్డి, నాయకులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, నిరంజన్‌బాబురెడ్డి, ముదిరెడ్డి,  మల్లికార్జునరెడ్డి, నరసింహులురెడ్డి, బైనా సుబ్బారావు, సొప్రం సురేష్, దొంతాల మణి, సర్పంచి విజయలక్ష్మి, కూట్ల ఉమ, అట్లూరి సుబ్రహ్మణ్యం, చిరంజీవి, పన్నెం సుబ్రహ్మణ్యం,సుధాకర్‌రెడ్డి  పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement