ఎక్కడి చెత్త అక్కడే | muncipality workers not taking dust from dust bins | Sakshi
Sakshi News home page

ఎక్కడి చెత్త అక్కడే

Dec 11 2013 1:22 AM | Updated on Oct 16 2018 6:35 PM

జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు, తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు, 1300 పైగా పంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో 60 శాతం పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ లేదు.

 జిల్లా చెత్త కుప్పగా మారుతోంది. గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా వీధులన్నీ చెత్తాచెదారం, మురుగునీటితో నిండిపోతున్నాయి.  పంచాయతీలకు సర్పంచ్‌లున్నారు, నిధులు లేవు. మున్సిపాలిటీల్లో  నిధులూ లేవు, పాలకవర్గాలూ లేవు. ఎవరూ పట్టించుకునే వారు లేక ప్రజలు రోగాల పాలవుతున్నారు.
 
 సాక్షి, చిత్తూరు:
 జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు, తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు, 1300 పైగా పంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో 60 శాతం పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ లేదు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ మురుగునీటి కాలువలు నిర్మించలేదు. వీధుల్లోనే మురుగునీరు ప్రవహిస్తోంది. దీంతో దోమలు విజృంభిస్తున్నాయి. ఫలితంగా జనం మలేరియా, చికున్‌గున్యా వంటి జ్వరాల బారినపడుతున్నారు. కొన్నిచోట్ల మంచినీటి పైపుల్లోకి మురుగునీరు చేరుతోంది. ఈ నీటిని తాగిన జనం అతిసార వ్యాధికి గురవుతున్నారు.
 
 శ్రీకాళహస్తి పట్టణంలో రెండు నెలలుగా చెత్త తొలగించలేదు. పట్టణంలోని శ్రీరామకాలనీలోని పంటకాలువ ఆక్రమణకు గురైంది. దీంతో మురుగునీరు పోకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మురికికాలువలను సక్రమంగా శుభ్రపరచలేదు. సుమారు 60 శాతం గ్రామాల్లో మురుగునీటి పారుదల సౌకర్యం లేదు.
 చిత్తూరు కార్పొరేషన్‌లో అక్కడక్కడా కాలువలు నిర్మించకపోవడంతో రోడ్లపైన్నే మురుగునీరు పారుతోంది. మురికివాడల్లో పారిశుద్ధ్య నిర్వహణ లోపభూయిష్టంగా ఉంది.
 
 తిరుపతి కార్పొరేషన్‌లో డంపర్‌బిన్లు లేకపోవడంతో కాలనీల్లో రోడ్లపైన్నే చెత్త పారబోస్తున్నారు. డంపర్‌బిన్లు కొరత ఉంది. రోజు మార్చి రోజు చెత్త తొలగిస్తున్నారు.పలమనేరు నియోజకవర్గం 90 పంచాయతీల్లోని 81 పంచాయతీల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. 13 ఆర్థిక సంఘం నిధులు మంచినీరు, పారిశుద్ధ్య నిర్వహణకు వాడుకోవచ్చు. అయితే ట్రెజరీ ఆథరైజేషన్ శనివారం వచ్చింది. పనులు ఇంకా ప్రారంభం కాలేదు. మున్సిపాలిటీకి సంబంధించి పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు లేవు. జనరల్ ఫండ్‌లోనే వాడుకోవాలి. నిధుల కొరతతో పారిశుద్ధ్యం లోపించింది.
 
 తంబళ్లపల్లె నియోజకవర్గంలో 79 పంచాయతీలు ఉన్నాయి. వీటిలోని 40 శాతం పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ మాటేలేదు. పెద్దమండ్యంలో రూ.4 లక్షలతో మురుగునీటి కాలువలు నిర్మిస్తే పూడిపోయాయి. దీంతో మురుగునీరు రోడ్డుపైనే ప్రవహిస్తోంది. ములకలచెరువు పంచాయతీ బురకాయలకోటలో మురుగునీరు రోడ్లపైన్నే పారుతోంది. బి.కొత్తకోట శివారు ప్రాంతాల వారికి మురుగునీటి పారుదల సౌకర్యం లేదు. పర్యాటక కేంద్రం హార్సీలీహిల్స్‌లో ఎక్కడ చూసినా చెత్తాచెదారమే.
 
 మదనపల్లె మున్సిపాలిటీలోని దేవళం వీధి, మోతీనగర్, నీరుగట్టివారిపల్లె, రెడ్డెప్పనాయుడు కాలనీల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. నిమ్మనపల్లెలో ముస్లిం బజారులో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది.
 పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పారిశుధ్యం అధ్వానంగా ఉంది. గ్రామాల్లో నెలకొకసారి పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు. నెలరోజులుగా చెత్త పేరుకుపోయి ఉంది. ప్రతివారం చెత్త తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
 
 పీలేరు నియోజకవర్గంలో పారిశుద్ధ్య నిర్వహణ పరమ చెత్త అని చెప్పవచ్చు. పీలేరు పట్టణంలో రెండు మూడు రోజులకూ చెత్త తొలగించడం లేదు. శివారు ప్రాంతాల్లో కాలువలు లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది.
 
 నగరి నియోజకవర్గంలో ఐదు మండలాలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. పుత్తూరు, నగరి మున్సిపాలిటీల్లోని 51 వార్డుల్లోనూ చెత్తా చెదారం పేరుకుపోయి ఉంది. పంచాయతీలుగా ఉన్నప్పుడు వేసిన మురుగునీటి కాలువలే ఉన్నాయి. వీటి నిర్వహణ అధ్వానంగా ఉంది. మున్సిపల్ పాలకవర్గాలు లేకపోవడంతో ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిధులు లేవని కొత్తగా వచ్చిన సర్పంచ్‌లు పట్టించుకోవడం లేదు. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. మురికినీటి కాలువలు కొత్తగా నిర్మించలేదు.
 
 సత్యవేడు మండలం కన్నావరం గ్రామంలో పారిశుద్ధ్యం మాటేలేదు. దళితవాడలో 200 ఇళ్లలో ఒక్క ఇంటికీ మరుగుదొడ్డి లేదు. కాలువలు లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైన పారుతోంది. సమారు 80 శాతం గ్రామాల్లో కుప్పతొట్టెలు ఏర్పాటు చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement