జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం 35వ రోజైన మంగళవారం ఉధృతంగా సాగింది. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు ఉద్యమాన్ని హోరెత్తించారు.
సాక్షి, నెల్లూరు: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం 35వ రోజైన మంగళవారం ఉధృతంగా సాగింది. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు ఉద్యమాన్ని హోరెత్తించారు. నగరంలోని ఏసీ స్టేడియంలో గురువారం లక్ష మందితో సమైక్యాంధ్ర సింహగర్జన నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నెల్లూరు నగరంలోని ఏసీ స్టేడియంలో ఈ నెల 5న లక్షమందితో సమైక్యాంధ్ర సింహగర్జన నిర్వహిస్తున్నట్టు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు, డీఆర్ఓ రామిరెడ్డి తెలిపారు. జిల్లా పరిషత్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని మొత్తం 15 ప్రాంతాల నుంచి ర్యాలీగా బయల్దేరి ఏసీ స్టేడియానికి చేరుకుంటారన్నారు.
స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. కలెక్టరేట్ ఎదుట ఎంపీడీఓల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కావలిలో సమైక్య రాష్ట్రం కోసం వివిధ విద్యాసంస్థల ఆధ్వర్యంలో జెండాచెట్టు సెంటర్ నుంచి ఆర్డీవో కార్యాలయం సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 20 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. డీఈఓ మువ్వా రామలింగం ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో కావలి ఆర్డీవో పీవీ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, ఎంఈవో సత్యనారాయణ, ప్రైవేటు స్కూళ్ల అసోసియేషన్ నిర్వాహకులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. అల్లూరులో విద్యార్థుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, 100 మీటర్ల జాతీయ పతాకంతో ఉరేగింపు నిర్వహించారు.ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ సెంటర్లో ఎస్యూపీఎస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు రాస్తారోకో నిర్వహించారు.సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో 22 రోజులుగా రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం నాటి దీక్షలో మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు ఆధ్వర్యంలో ఉద్యోగులు, సిబ్బంది కూర్చున్నారు. పట్టణంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య సంఘీభావం తెలిపారు. సమైక్యవాదుల ఆధ్వర్యంలో పొదలకూరులో బంద్ పాటించి వంటావార్పు జరిపారు. గూడూరులో జేఏసీ నాయకులు బ్యాంకులు, ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. కొన్ని బస్సులు తిరుగుతుండటంతో గాలితీసేశారు. జేఏసీ నాయకులపై ఆర్ఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జేఏసీ నాయకులు డిపో ఎదుట బైఠాయించి ఆర్ఎం, డీఎం ఖబడ్దార్ అంటూ నినాదాలు చేశారు. ఆర్ఎంను ఎస్ఐ పిలిపించి తానూ సమైక్యవాదినే అని చెప్పించడంతో ఆందోళన విరమించారు. జేఏసీ నాయకులు విద్యార్థులతో కలిసి చిల్లకూరు జాతీయరహదారిపై రాస్తారోకో చేసి మోకాళ్లపై నిరసన వ్యక్తం చేశారు. వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాళెంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. బాలిరెడ్డిపాళెంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను మూసివేశారు. ఉదయగిరి బస్టాండ్లో వైఎస్సార్సీపీ నేతలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 15 రోజులుగా కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నాయకులు గానుగపెంట ఓబుల్రెడ్డి, శ్రీనివాసులురెడ్డి మద్దతు తెలిపారు.
ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పట్టణంలో భిక్షాటన చేశారు. సీతారాంపురంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ, పోరాట సమితి రిలే దీక్షలు కొనసాగాయి. వింజమూరులో సకల జనుల సమ్మె జరిగింది. విద్యార్థులు, యువకులు రోడ్డుపై ఆటలు ఆడారు. సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. కోవూరు ఎన్జీఓ హోంలో గ్రామస్తులు నిరాహారదీక్ష చేపట్టారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడ నుంచి మునులపూడి వరకు ఉద్యోగ జేఏసీ నాయకుల ర్యాలీ నిర్వహించారు.