శాసనమండలిలో రెండు స్థానాలకు ఎన్నికల నగారా మోగింది.
తెలంగాణలోని రెండు పట్టభద్రుల స్థానాల ఎన్నికకు సీఈసీ షెడ్యూల్
ఈ నెల 19న నోటిఫికేషన్.. 26 వరకు నామినేషన్లు..
మార్చి 16న ఎన్నికలు.. 19న ఫలితాలు
ఆంధ్రప్రదేశ్లోని రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకూ ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో రెండు స్థానాలకు ఎన్నికల నగారా మోగింది. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు మార్చి 16న ఎన్నికలు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లోనూ ‘తూర్పు-పశ్చిమగోదావరి’, ‘కృష్ణా-గుంటూరు’ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 19న నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
నామినేషన్ల దాఖలుకు 26 తుదిగడువు. 27న నామినేషన్ల పరిశీలన.. మార్చి 2 వరకు ఉపసంహరణకు గడువు. అదే నెల 16న ఎన్నికలు నిర్వహించి.. 19న ఓట్లు లెక్కించి, ఫలితాలను విడుదల చేస్తారు. పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్సీలుగా ఉన్న కె.నాగేశ్వర్ (మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్), కపిలవాయి దిలీప్ కుమార్ (వరంగల్-ఖమ్మం-నల్లగొండ)ల పదవీ కాలం మార్చి 29వ తేదీతో ముగుస్తోంది. దీంతో ఎన్నికలు జరుగుతున్నాయి.
వాస్తవానికి మార్చి 29వ తేదీన ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఏడుగురు ఎమ్మెల్సీల పదవీకాలం కూడా ముగుస్తోంది. కానీ ముందుగా కేవలం రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికకే షెడ్యూలు వచ్చింది.