
నా విషయంలో తలదూర్చడానికి గంటా ఎవరు?
గత కొంతకాలంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్న గిరిజన మంత్రి బాలరాజు తన కోపాన్ని ఈసారి సహచర మంత్రి గంటా శ్రీనివాసరావుపై చూపారు.
విశాఖ : గత కొంతకాలంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్న గిరిజన మంత్రి బాలరాజు తన కోపాన్ని ఈసారి సహచర మంత్రి గంటా శ్రీనివాసరావుపై చూపారు. తన విషయంలో తలదూర్చడానికి గంటా ఎవరు అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రచ్చబండ విషయంలో తనకు సమాచారం లేదని బాలరాజు తెలిపారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చాకే తన నిర్ణయం చెబుతానని ఆయన అన్నారు. రాజకీయ నేతలు రాజకీయం చేయకపోతే వ్యాపారాలు చేస్తారా అని అన్నారు. వ్యక్తులకు విధేయత చూపటం తన పద్ధతి కాదని బాలరాజు వ్యాఖ్యానించారు.
కాగా ముఖ్యమంత్రికి, తనకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని, అన్నీ తొందర్లోనే సర్దుకుంటాయని మంత్రి బాలరాజు పేర్కొనటం విశేషం. కిరణ్కుమార్రెడ్డి చోడవరం సభకు వచ్చినప్పుడు గిరిజన శాఖ పథకాన్ని తాను లేకుండా ప్రారంభించడం సమంజసం కాదన్నారు. మరోవైపు బాలరాజు ఈరోజు సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.