ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ (రెఫర్డ్ బ్యాచ్) విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి.
ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ (రెఫర్డ్ బ్యాచ్) విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. సీమాంధ్ర జిల్లాల్లో తీవ్రస్థాయిలో సమ్మె జరుగుతున్న కారణంగా ఎగ్జామినర్లు అందుబాటులో లేరని, అందుకే ఈ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ చాన్స్లర్ వైద్య కళాశాలలకు సమాచారమిచ్చారు.
నిర్ణయించిన తేదీల ప్రకారం ఈనెల 27, 28, 30, 31 తేదీలలో జరగాలి. కానీ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్న కళాశాలల అధ్యాపకులే కాకుండా, బయట రాష్ట్రాల నుంచి లేదా జిల్లాల నుంచి ఎగ్జామినర్లు రావాల్సి ఉంటుంది. కానీ ఈ పరిస్థితుల్లో రావడానికి ముందుకు రాలేదని తెలిసింది. తిరిగి ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో తేదీలు ఇవ్వలేదు.
ఇదిలా ఉండగా, తెలంగాణ జిల్లాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నా వైస్ చాన్స్లర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇక్కడ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించలేదని తెలంగాణ వైద్యులు ఆరోపించారు. ఎగ్జామినర్లుగా ఎవరికి విధులు అప్పజెప్పారన్న సమాచారం కూడా ఇవ్వలేదని ఓ వైద్యుడు పేర్కొన్నారు. దీనిపై వైద్య మంత్రి స్పందించక పోవడం ఘోరమని విమర్శించారు.