కార్మిక హక్కులను హరిస్తే సహించం | May day celebrations | Sakshi
Sakshi News home page

కార్మిక హక్కులను హరిస్తే సహించం

May 2 2015 2:06 AM | Updated on Oct 20 2018 6:19 PM

కార్మిక హక్కులను హరిస్తే సహించేది లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్ చెప్పారు.

వాడవాడలా మేడే వేడుకలు
 నెల్లూరు(సెంట్రల్): కార్మిక హక్కులను హరిస్తే సహించేది లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి  చండ్ర రాజగోపాల్,  సీఐటీయూ జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్ చెప్పారు. మేడే సందర్బంగా నగరంలోని ఏబీఎం కాంపౌండు నుంచి ఆర్టీసీ బస్టాండు వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్టీసీ బస్టాండు వద్ద బహిరంగసభ ఏర్పాటుచేశారు. అజయ్‌కుమార్ మాట్లాడుతూ తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ, తెలుగుదేశం ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.

కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం మొసలి కన్నీరు కార్చిన టీడీపీ, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్యలు చేపట్టారని ఆందోళన చెందారు. బహుళజాతి కంపెనీలకు భూములు అప్పగిస్తూ రైతులు, కూలీలు, కార్మికుల కడుపు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం నగర, రూరల్ కార్యదర్శులు మూలం రమేష్, మాదాల వెంకటేశ్వర్లు, కత్తి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
 
 రెపరెపలాడిన ఎర్రజెండాలు..
 మేడే సంద ర్భంగా నగరంలో పలు చోట్ల ఎర్ర జెండాలు రెపరెపలాడాయి. ఆత్మకూరు బస్టాండు ,కనకమహల్, వీఆర్సీ, మద్రాసు బస్టాండు, ఆర్టీసీ, పలు చోట్ల ఎర్రజెండాలతో నగరం నిండిపోయింది. కనకమహల్ సెంటరులో సీపీఎం నాయకులు ఎర్రజెండాలతో ఆ ప్రాంతాన్ని నింపారు. పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు.
 
 ఆయన కార్మికుల పక్షాన పోరాడిన తీరును గుర్తు చేసుకున్నారు. సీపీఎం సీనియర్ నాయకులు జక్కా వెంకయ్య మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. చంద్రారెడ్డి, సూర్యనారాయణ, మస్తాన్‌బీ, గోపాల్, శ్రీనివాసులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement