ఇద్దరిని వంచించి... మూడో అమ్మాయితో పెళ్లి | Man cheats 2 womens, files cheating complaint in anantapur district | Sakshi
Sakshi News home page

ఇద్దరిని వంచించి... మూడో అమ్మాయితో పెళ్లి

Jul 4 2014 10:20 AM | Updated on Aug 21 2018 8:23 PM

ఇద్దరిని వంచించి... మూడో అమ్మాయితో పెళ్లి - Sakshi

ఇద్దరిని వంచించి... మూడో అమ్మాయితో పెళ్లి

: ప్రేమ పేరుతో ఇద్దరిని వంచించి...మరో యువతికి మూడు ముళ్లు వేసిన ఓ యువకుడి ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది.

అనంతపురం : ప్రేమ పేరుతో ఇద్దరిని వంచించి...మరో యువతికి మూడు ముళ్లు వేసిన ఓ యువకుడి ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. దాంతో మోసపోయిన ఇద్దరు యువతులు కూడా తమకు ఆ యువకుడితోనే పెళ్లి చేయాలని పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం మేరకు...అనంతపురం జిల్లా గుడిబండ మండలం హిరేతుర్పి గ్రామానికి చెందిన సుధాకర్ బెంగళూరులో ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. అక్కడ పనిచేసే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువతులను ఒకరికి తెలియకుండా ఒకరిని ప్రేమిస్తున్నానని నమ్మించాడు.

ఒకేచోట పని చేస్తున్నా... ఇద్దరూ తారసపడితే ఒకరిని సోదరి అంటూ చెప్పి వారిని మభ్యపెట్టేవాడు. ఈ క్రమంలో ఆ ఇద్దరు యువతులు గర్భం దాల్చటంతో అబార్షన్లు చేయించాడు. అయితే వారిద్దరిని కాదని మూడు నెలల క్రితం పావగడ తాలూకా మద్దిబండకు చెందిన మరో యువతిని సుధాకర్ పెళ్లి చేసుకున్నాడు. వివాహ సమయంలో తన చెల్లి పెళ్లి అని, ఖర్చుల నిమిత్తం ఆ ఇద్దరు యువతుల నుంచి దాదాపు రెండు లక్షలు దాకా తీసుకున్నాడు. అనంతరం అతడు ముఖం చాటేయటంతో తాము మోసపోయినట్లు తెలుసుకున్న ఇద్దరమ్మాయిలు సుధాకర్ సొంత గ్రామానికి వచ్చారు.

అతడి నిర్వాకాన్ని గ్రామస్తులకు వివరించారు. తమకు సుధాకర్తోనే వివాహం జరిపించాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటామని తేల్చి చెప్పారు. అయితే తన భర్తకు ఎటువంటి సంబంధం లేకపోయినా ఆ ఇద్దరు యువతులు బ్లాక్మెయిల్ చేస్తున్నారని సుధాకర్ భార్య గుడిబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మరోవైపు తమను నమ్మించి మోసం చేసిన సుధాకర్తోనే పెళ్లి జరిపించి న్యాయం చేయాలని ఇద్దరు యువతులు నిన్న పోలీసుల్ని ఆశ్రయించారు. అయితే యువతులు మోసపోయింది బెంగళూరులో కాబట్టి అక్కడ పోలీసులకే ఫిర్యాదు చేయాలని ఎస్ఐ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement