మాఫియా కోరల్లో ‘పశ్చిమ’ | Mafia trafficked women Spurious liquor in Eluru | Sakshi
Sakshi News home page

మాఫియా కోరల్లో ‘పశ్చిమ’

Jan 16 2014 2:37 AM | Updated on Sep 2 2017 2:38 AM

పచ్చని పంట పొలాలు.. ప్రేమానురాగాలు, అనుబంధాలను పంచే పల్లెలు.. కల్లాకపటం తెలియని ప్రజలు.. కక్షలు, కార్పణ్యాలకు దూరంగా ప్రశాంత వాతావరణం

పచ్చని పంట పొలాలు.. ప్రేమానురాగాలు, అనుబంధాలను పంచే పల్లెలు.. కల్లాకపటం తెలియని ప్రజలు.. కక్షలు, కార్పణ్యాలకు దూరంగా ప్రశాంత వాతావరణం.. ఇవీ మన జిల్లా పేరు చెబితే ఒకప్పుడు గుర్తుకొచ్చేవి. ఇప్పుడా సంస్కృతి జిల్లా నుంచి మాయమయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి.  కొంతకాలంగా పచ్చని పశ్చిమలో చీకటి సామ్రాజ్యం వేగంగా విస్తరిస్తోంది. దొంగనోట్ల ముద్రణ, చలామణి, ఇసుక మాఫియా, మహిళల అక్రమ రవాణా, కల్తీ మద్యం, కలప స్మగ్లింగ్ సహా ఫ్యాక్షన్ ఛాయలు జిల్లాకు మచ్చ తెస్తున్నాయి. వీటిని అదుపు చేయడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోంది. 
 
 సాక్షి, ఏలూరు : పచ్చని పశ్చిమ నేడు చీకటి సామ్రాజ్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాసతో కొందరు జిల్లా ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. ప్రశాంత జిల్లాగా పేరొందిన పశ్చిమకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు అక్రమార్కులు ఇక్కడ చీకటి సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. కొందరు అధికారుల అండదండలతో అక్రమ వ్యాపారాలకు పాల్పడుతున్నారు. ఈ మాఫియాను అడ్డుకునేందుకు యంత్రాగం పూర్తిగా దృష్టి సారించడం లేదనే విమర్శలు ఉన్నాయి.  
 
 దొంగ నోట్ల ముద్రణకు కేరాఫ్ అడ్రస్
 జిల్లా దొంగనోట్ల ముద్రణ, చెలామణికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. నాలుగేళ్లుగా ఈ దందా కార్యకలపాలు మరింత జోరందుకున్నాయి. మూడేళ్ల క్రితం నిడదవోలులో దొంగనోట్ల ముద్రణాలయాన్ని ఏర్పాటు చేసి నకిలీ కరెన్సీ ముద్రణకు రంగం సిద్ధం చేయగా పోలీసులు దాడి చేసి రూ.40 లక్షల విలువైన నకిలీనోట్లు గుర్తించారు. ఇటీవల కొవ్వూరు మండలం పంగిడిలో ఆరుగురు సభ్యుల దొంగనోట్ల ముఠాను పట్టుకున్నారు. వారు స్థానికంగానే దొంగనోట్లు ముద్రించి చెలామణి చేస్తుండడం గమనార్హం. వారు చెప్పిన విషయాలు పోలీసులను సైతం షాక్‌కు గురిచేశాయి. నకిలీ కరెన్సీ కేసుల్లో పట్టుబడిన  వ్యక్తులను రాజమండ్రి కేంద్ర కారాగారానికి రిమాండ్ కోసం తరలిస్తుంటారు. వీరు జైల్లో ఉన్న మరికొందరు నేరస్తులను తమ నెట్‌వర్క్‌లో చేర్చుకుని వారు విడుదలయ్యాక వారి ద్వారా జిల్లా అంతటా తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నారు. అలా విస్తరించిన ఈ ముఠాల్లో ఇప్పుడు వందల మంది ఉన్నట్టు సమాచారం.  
 
 మహిళల అక్రమ రవాణా
 జిల్లా నుంచి ఏడాదికి దాదాపు 400 మంది మహిళలు అదృశ్యమవుతున్నారు. వీరిలో కొందరు బళ్లారి, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కత్తాల్లోని వ్యభిచార గృహాల్లో అమ్ముడుపోతున్నారు. మరికొందరు ఇతర దేశాలకు రవాణా అవుతున్నారు. మాట వినని వారు మత్యువాత పడుతున్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని, ఉపాధి చూపిస్తామని,పెంచుకుంటామని,పెళ్లి చేసుకుని ఇలా ఏదో ఓ ఆశ చూపి అమాయక యువతులను వంచిస్తున్నారు. 
 
 కలప స్మగ్లింగ్
 జిల్లాలో అటవీ సంపదకు కొదవలేదు. కానీ అక్రమార్కుల చేతుల్లో అడవితల్లి నలిగిపోతోంది. ఏజెన్సీ ప్రాంతాలైన పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో టేకు, ఇరుగుడు చేవ (రోజ్ ఉడ్) కలపను విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాలతో పాటు ఇతర రాష్ట్రాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు. 
 
 విస్తరిస్తున్న గ్యాస్, గుట్కా మాఫియా 
 వంట గ్యాస్‌కు ఉన్న డిమాండ్ గ్యాస్ మాఫియా సొమ్ము చేసుకుంటోంది. గ్యాస్ ఫిల్లింగ్‌లో మోసాలకు పాల్పడటం, గ్యాస్ ఏజెన్సీలతో కుమ్మకై బ్లాక్‌మార్కెట్‌లో ఎక్కువ రేటుకి విక్రయించడం పరిపాటిగా మారింది. వంట గ్యాస్ సిలిండర్‌లో 14.5 కేజీలు ఉండాల్సి ఉండగా కొందరు ప్రైవేట్ వ్యక్తులు సిలిండర్లను బ్లాక్‌లో కొని కేజీన్నర తగ్గించి విక్రయిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రాణాంతకమైన గుట్కాపై ప్రభుత్వం నిషేధం విధించినా జిల్లాలో వాటిని విరివిగా విక్రయిస్తున్నారు. ఇటీవల భీమవరంలో గుట్కా ప్యాకెట్ల భారీ డంప్ బయటపడింది. ఏలూరు నగరాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుని గుట్కా తయారీ కూడా జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  
 
 మూగ జీవాలనూ 
 వదలడం లేదు 
 దైవాంత సంభూతంగా భావించే తాబేళ్లతోనూ మాఫియా ముఠాలు వ్యాపారం చేస్తున్నాయి. పాలకొల్లు, నరసాపురం సముద్ర తీర ప్రాంతంలో స్థానికుల నుంచి తాబేళ్లను సేకరించి వాటిని ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. 
 
 ఇసుక దందా రూటే సెపరేటు
 ఇటీవల కాలంగా ఇసుక దందా విపరీతంగా పెరిగిపోయింది. గోదావరి, తమ్మిలేరు, ఎర్రకాలువ నుంచి ఇసుక అక్రమంగా జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకకు మంచి డిమాండ్ ఉండడంతో కొందరు అక్రమార్కులు అధికారుల అండదండలతో ర్యాంపుల్లో అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. నిడదవోలు మండలం విజ్జేశ్వరం, సీతంపేట, వాడపల్లి, మద్దూరు లంక, పెదవేగి మండలం పినకడిమి, జానంపేట, విజయరాయి, బి.శింగవరం, రామచంద్రపురం, నడిపల్లి, దుగ్గిరాల, పోలవరం మండలంలో యడ్లగూడెం, నూతనగూడెం, కొత్తపట్టిసీమ, గూటాల, హక్కుంపేట ప్రాంతాల్లో ఇసుక మాఫియా విజృంభిస్తోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement