ఎమ్మిగనూరులో భారీ ర్యాలీ | maasive rally in yemmiganuru | Sakshi
Sakshi News home page

ఎమ్మిగనూరులో భారీ ర్యాలీ

Sep 2 2013 3:34 AM | Updated on Sep 1 2017 10:21 PM

సమైక్య ఉద్యమం రగులుతోంది. విభజన నిర్ణయంపై సీమ మహోగ్రరూపం దాలుస్తోంది. తెలుగు ప్రజలను చీల్చే కుట్రపై పోరు ఉద్ధృతమవుతోంది.

సాక్షి, కర్నూలు:సమైక్య ఉద్యమం రగులుతోంది. విభజన నిర్ణయంపై సీమ మహోగ్రరూపం దాలుస్తోంది. తెలుగు ప్రజలను చీల్చే కుట్రపై పోరు ఉద్ధృతమవుతోంది. నిరసనలు మిన్నంటుతుండగా.. సమైక్యగళం హోరెత్తుతోంది. ఉ ద్యోగులు విరామం లేని పోరు సాగిస్తుండగా.. విద్యార్థి లోకం కదం తొక్కుతోంది. ఆదివారం రోజునా జిల్లా వ్యాప్తంగా సమైక్య నినాదం మారుమ్రోగింది. కర్నూలు నగరంలోని కొత్తబస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు కర్నూలు జిల్లా గౌండ కాంట్రాక్టర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు డ్రమ్ములు, తప్పెట్లతో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నృత్యప్రదర్శన సమైక్యవాదులను ఆకట్టుకుంది. ప్రభుత్వ డ్రైవర్ల సంఘం వినూత్న రీతిలో దిగ్విజయ్‌సింగ్ శవయాత్ర చేపట్టి రాష్ట్ర విభజన నిర్ణయంపై నిరసన వ్యక్తం చేసింది. విభజనకు నిరసనగా నేడు కర్నూలులో ఆటోల బంద్‌కు జేఏసీ పిలుపునిచ్చింది. కర్నూలు జిల్లా చౌకడిపో డీలర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో 8వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఆదోనిలో రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రకు కలిగే  నష్టాన్ని జేఏసీ నాయకులు ప్రజలకు వివరించారు.
 
 ఫుట్‌వేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాతబస్టాండ్ సర్కిల్‌లో చెప్పులు కుట్టి నిరసన తెలిపారు. ఆలూరులో జేఏసీ ఆధ్వర్యంలో రేషన్‌షాపుల డీలర్లు ఆందోళన చేపట్టారు. ఆళ్లగడ్డ పట్టణంలో జేఏసీ నాయకులు.. ఆత్మకూరులో వైఎస్‌ఆర్‌సీపీ నేత బుడ్డా శేషారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. తాపీ మేస్త్రీ, సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు కర్నూలు-గుంటూరు రహదారిని దిగ్బంధించారు. బేతంచర్ల మండలంలో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో మహిళలు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. పాణ్యంలో మైనార్టీలు, వాల్మీకుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. డోన్ పట్టణంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌లు, కొచ్చెర్వు గ్రామస్తులు, ఆటోవర్కర్స్ యూనియన్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప నగర్‌కు చెందిన క్యాబర్సి శ్రీనివాసులు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష మూడో రోజుకు చేరుకుంది. మంత్రాలయం మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుమార్తె ప్రియాంకారెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి కుమార్తె గౌతమిరెడ్డిలు ఆయనకు సంఘీభావం తెలిపారు. విభజనను వ్యతిరేకిస్తూ మండల పరిధిలోని గుడేకల్లు గ్రామ ప్రజలు పట్టణంలో ఎద్దుల బండ్ల ర్యాలీ, కేసీఆర్ శవయాత్రను నిర్వహించారు. పద్మశాలి సంఘం, బండలు, టైల్స్ డిపోల ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించి సోమప్ప సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement