వైభవంగా శ్రీవారి నూతన పాదాల ప్రతిష్టాపన | Lord Venkateswara Srivari Padalu re install in Narayanagiri | Sakshi
Sakshi News home page

వైభవంగా శ్రీవారి నూతన పాదాల ప్రతిష్టాపన

Sep 18 2013 9:10 AM | Updated on Sep 1 2017 10:50 PM

నారాయణగిరి పర్వత శ్రేణుల్లో పాదాల మండలంలో శ్రీవారి నూతన పాదాల ప్రతిష్టాపన బుధవారం ఉదయం వైభవంగా జరిగింది.

తిరుపతి : నారాయణగిరి పర్వత శ్రేణుల్లో పాదాల మండలంలో ఇటీవల బొటవేలు దెబ్బతిన్న శ్రీవారి పాదాల స్థానంలో నూతన పాదాల ప్రతిష్టాపన బుధవారం ఉదయం వైభవంగా జరిగింది. దెబ్బతిన్న పాదాల స్థానంలో నూతన పాదాలను ఈరోజు ఉదయం మీన లగ్నంలో  వేద మంత్రోచ్ఛరణల మధ్య సంప్రదాయ బద్ధంగా పండితులు ప్రతిష్ట చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు పాల్గొన్నారు.

అయితే.. ఇప్పుడే శ్రీవారి పాదాలను దర్శించుకోవడానికి వెంకటేశ్వరుడి భక్తులకు అనుమతి ఇవ్వడంలేదు. సోమవారం వరకు పనులు  జరుగనున్నాయి. అప్పటి వరకు భక్తుల దర్శనాలను నిలిపేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. బొటనవేలు విరిగిన శ్రీవారి పాదాలను దేవాలయానికి చెందిన మ్యూజియంలో భద్రపరుస్తామన్నారు. కొత్తగా ప్రతిష్ఠించిన శ్రీవారి పాదాల పరిరక్షణ కోసం ... గాజుతో ఓ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయనున్నారు.

అలాగే తిరుమలలో శ్రీ అనంత పద్మనాభస్వామి వ్రతం సందర్బంగా శ్రీవారికి చక్రస్నానం నిర్వహించారు. ప్రతియేటా బ్రహ్మోత్సవాల చివరి రోజు, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, అనంత పద్మనాభస్వామి చతుర్దశి రోజు చక్రస్నానం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉదయం 5.30 గంటలకు ఆలయం నుంచి సుదర్శన చక్రతాళ్వార్ను ఊరేగింపుగా పురవీధుల గుండా పుష్కరణి వద్దకు తీసుకు వచ్చారు. అక్కడ ఆగమబద్దంగా పూజలు, స్నపన తిరుమంజనం నిర్వహించి, పవిత్ర స్నానం చేయించారు. ఈ సందర్భంగా వేలాదిమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.

Advertisement
 
Advertisement
Advertisement