నగరపంచాయతీకి ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగనున్నాయా? దీనిపై మున్సిపాలిటీ అధికారులకు ప్రభుత్వం
ఏప్రిల్లోనే జరిగే అవకాశం
నెల్లిమర్ల, జరజాపుపేటల్లో జోరందుకున్న ఊహాగానాలు
ఎన్నికలను అడ్డుకోవాలని జరజాపుపేట వాసుల ప్రచారం
నెల్లిమర్ల : నగరపంచాయతీకి ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగనున్నాయా? దీనిపై మున్సిపాలిటీ అధికారులకు ప్రభుత్వం నుంచి సంకేతాలు అందాయా? ప్రస్తుతం నెల్లిమర్ల, జరజాపుపేట ప్రాంతాల్లో జరుగుతున్న చర్చ ఇదే. మున్సిపాలిటీ అధికారులు కూడా ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నగరపంచాయతీనుంచి తమ ప్రాంతాన్ని తప్పించాలని, లేదంటే ఎన్నికలను అడ్డుకోవాలని జరజాపుపేట ప్రజలు పట్టుదలగా ఉన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాద్వారా ప్రచారం చేస్తున్నారు.
2013 నుంచి గ్రేడ్-3 మునిసిపాలిటీగా...
నెల్లిమర్ల, జరజాపుపేట మేజరు పంచాయతీలను కలిపి నగరపంచాయతీ(గ్రేడ్-3 మున్సిపాలిటీ)గా 2013 మార్చిలో అప్పటి ప్రభుత్వం స్థాయి పెంచింది. తమకు నగరపంచాయతీ వద్దని, తిరిగి గ్రామపంచాయతీలుగా మార్చాలని ఈ రెండు ప్రాంతాల ప్రజలు అప్పటినుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ప్రధానంగా జరజాపుపేటవాసులు ఇప్పటికే సీఎం చంద్రబాబును కలిసి తిరిగి గ్రామపంచాయతీగా మార్చాలని విన్నవించారు. గతంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధం కాగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు.
మళ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు
నగరపంచాయతీ ఏర్పాటై మూడేళ్ళు పూర్తయిన సందర్భంగా ఎలాగైనా ఏప్రిల్లో నెల్లిమర్లకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. దీనికోసం సమగ్ర సమాచారం పంపించాలని మున్సిపాలిటీ అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికలు జరగని మున్సిపాలిటీలతో పాటే నెల్లిమర్లకు కూడా ఎన్నికలు నిర్వహిస్తారని సమాచారం. ఇదే విషయమై నెల్లిమర్ల, జరజాపుపేట ప్రాంతాల్లో ప్రచారం జరుగుతోంది.