హైపవర్ కమిటీకి జర్నలిస్టుల సూచనలు
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ మూడు రోజుల విచారణ పూర్తి అయింది. దీనిపై ఈ నెల 20 లోగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని హైపవర్ కమిటీ చైర్మన్, భూమి శిస్తు చీఫ్ కమిషనర్ (సీసీఎల్ఎ) నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. గ్యాస్ లీకేజీ ఘటనకు సంబంధించి మొత్తం సమాచారాన్ని సేకరించి, దానిని క్రోడీకరించి సమగ్ర నివేదికను రూపొందించడానికి వీలుగా హైపవర్ కమిటీ సన్నాహాలు చేస్తోంది. (ఎల్జీ పాలిమర్స్కు ఎన్వోసీ ఇవ్వలేదు)
గ్యాస్ లీక్ అయిన సమయంలో పని చేసిన జర్నలిస్టులు, జీవీఎంసీ ఫైర్ సిబ్బంది అభిప్రాయాలను కమిటీ సభ్యులు సేకరించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ ప్రతినిధులు హైపవర్ కమిటీకి పలు సూచనలు చేశారు. మనుషులు, జంతువులపై స్టైరిన్ గ్యాస్ ప్రభావంపై పరిశోధనలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన ఆధారంగా ఇతర ప్రమాదకర పరిశ్రమల స్థితిగతులపైనా అధ్యయనం చేయాలని కోరారు. ముఖ్యంగా ప్రజల్లో మానసిక ఆందోళన తొలగించే ప్రయత్నం అత్యవసరమని పేర్కొన్నారు. (‘మేఘాద్రి’లో స్టైరిన్ లేదు)