అవినీతికి ‘సహకారం’ ! | legality Cooperative Corruption | Sakshi
Sakshi News home page

అవినీతికి ‘సహకారం’ !

Dec 12 2014 2:08 AM | Updated on Sep 22 2018 8:22 PM

అవినీతికి ‘సహకారం’ ! - Sakshi

అవినీతికి ‘సహకారం’ !

సభ్యుల సంక్షేమమే పరమావధిగా పనిచేయవలసిన పీఏసీఎస్‌లు, ఇతర సొసైటీలు అక్రమాల పుట్టలుగా మారాయి.

 సభ్యుల సంక్షేమమే పరమావధిగా పనిచేయవలసిన పీఏసీఎస్‌లు, ఇతర సొసైటీలు  అక్రమాల పుట్టలుగా మారాయి.  పాలకవర్గాలు, ఉద్యోగులు  పరస్పరం సహకరించుకుని రైతుల నోట్లో మట్టి కొడుతూ... కట్టలకొద్దీ నోట్లను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. దొరికితే దొంగ, దొరక్కపోతే దొరలా చలామణీ అవుతున్నారు. పత్రికల్లో వచ్చిన కథనాలు, బాధితుల ఆరోపణలతో బయటపడుతున్న బాగోతాలు కొన్ని మాత్రమే ... రాజకీయ నేతలు చెప్పినట్టల్లా అధికారులు ఆడుతుండడంతో  చాలా సొసైటీల్లో అక్రమాలు వెలుగు చూడడం లేదు.
 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం :  సహకార సంఘాల్లో అక్రమాలకు అంతేలేకుండా పోతోంది. గొట్లాం, రావివలస సొసైటీల్లోనే కాదు జిల్లాలో పలు సంఘాలపై గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. చాలా సొసైటీల్లో పాలక మండలి సభ్యులు,  సిబ్బంది కుమ్మక్కై   బినామీ పేర్లతో నిధులు దిగమింగారు.   ఆరోపణలు వచ్చిన తరువాత విచారణ నిర్వహించి బాధ్యుల్ని నుంచి సొమ్ము రికవరీ చేస్తున్నారు తప్పా...  నిరంతర పర్యవేక్షణ,  సహకార సంఘాల్లో ఏం జరుగుతుందో ఆరాతీసే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. అధికారులు.... నాయకుల అడుగులకు మడుగులొత్తడంతో చాలా సొసైటీల్లో అక్రమాలు వెలుగు చూడడం లేదు. వెలుగులోకి వచ్చాక బినామీ రుణ బాధితుల్ని  నయానో..భయానో తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.  
 
 జిల్లాలో ఇప్పటికే 23 సహకార సంఘాల్లో బినామీల రుణాల బాగోతం బయటపడింది. నిధుల దుర్వినియోగం, కొనుగోళ్లలో చేతివాటానికి అంతేలేకుండా పోయింది. సెక్షన్ 51 స్టాట్యుటరీ విచారణ, సెక్షన్ 52,53ల విచారణలు  చాలానే జరిగాయి. విచారణ  పూర్తయ్యాక సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు రికవరీకి ఉపక్రమించారు. అయితే, బాధ్యుల నుంచి సొమ్ము  రికవరీ చేయడంలో కూడా తాత్సారం జరుగుతోంది. తెరవెనుక ఒత్తిళ్లు, నిందితులు కోర్టులను ఆశ్రయించడం తదితర కారణాల వల్ల   ఏళ్లు గడుస్తున్నా పూర్తి స్థాయిలో రికవరీ జరగడం లేదు.
 
 అక్రమాలు జరిగిన సొసైటీ లు
 సెక్షన్ 51 స్టాట్యుటరీ విచారణ   ద్వారా పెద్దతాడివాడ, ఉత్తరాపల్లి, కుమ్మపల్లి, గజపతినగరం, తెర్లాం, పార్వతీపురం, సంతోషిపురం, అజ్జాడ, కోట సీతారాంపురం, జొన్నాడ, గజపతినగరం ఈపీ ఏడీబీ, గంట్యాడ, లక్కవరపుకోట, కంఠకాపల్లి, మాదలింగి, ఎం.మామిడిపల్లి, పిరిడి సొసైటీల్లో అక్రమాలు జరిగినట్టు తేల్చారు. వీటిలో పలు సొసైటీలపై సివిల్ చర్యలు తీసుకోగా, మరికొన్ని సొసైటీలపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకున్నారు. ఈ చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా రూ.కోటి 19లక్షల 78వేలు రికవరీ కావల్సి ఉంది.   అలాగే  సెక్షన్ 52 ప్రకారం విచారణ చేపట్టి, లక్కిడాం, నందిగాం, తెర్లాం, నర్సిపురం, కోనాడ, పూసపాటిరేగ, నిడగల్లు, సొసైటీల్లో అక్రమాల నిగ్గు తేల్చారు.
 
    సెక్షన్ 53 ప్రకారం గొట్లాం పీఏసీఎస్‌లో విచారణ నిర్వహించి  అక్రమాల్ని వెలికి తీశారు. ఇందులో రూ.కోటి 3లక్షల మేర అక్రమాలు జరిగాయి.  చనిపోయిన సొసైటీ అధ్యక్షుడు, కార్యదర్శులే  ఈ అవినీతికి కారణమని అధికారులు తేల్చేశారు.  బతికున్న సొసైటీ డెరైక్టర్లు, అందులో పనిచేసిన ఇతర సిబ్బందిని వదిలేశారు. వాస్తవానికి ఈ సొసైటీలో సెక్షన్ 51స్టాట్యుటరీ విచారణ జరపాలి. ఈ విచారణనకే చట్టబద్ధత ఉంటుంది. అంతేకాకుండా బయట వ్యక్తులు విచారణ చేపట్టడం ద్వారా  అక్రమాలు బయటపడే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఆ రకమైన విచారణ జరగలేదు. - పీఏసీఎస్‌లతో పాటు డీసీసీబీ, డీసీఎంఎస్, విజయా సొసైటీ,  రైల్వే ఉద్యోగుల సహకార సొసైటీల్లో కూడా సెక్షన్ 51 స్టాట్యుటరీ విచారణలు జరిగాయి.  డీసీసీబీలో రూ.5.68 లక్షలు, డీసీఎంఎస్‌లో రూ.5.24లక్షలు, రైల్వే ఉద్యోగుల సహకార సొసైటీలో సుమారు రూ.76లక్షల మేర అక్రమాలు జరిగినట్టు  తేలింది.
 
 అక్రమాలు ఇలా....
  సొసైటీల్లో జరిగిన అక్రమాల్లో  అటు పాలక వర్గ సభ్యులు, ఇటు సిబ్బంది ప్రమేయం ఎక్కువగా ఉంది.
   కొన్ని సొసైటీల్లో భూమి లేని వారిని సభ్యులగా చేర్చి, వారి పేరున తీసుకున్న రుణాలను పాలక వర్గ సభ్యులు తమ  జేబుల్లోకి వేసుకున్నారు.  మరికొన్ని సొసైటీల్లో  కౌలు రైతుల పేరిట కొందర్ని సభ్యులగా (సభ్యులుగా) చేర్పించి, వారి పేరునా, వారికి తెలియకుండా  రుణాలు కాజేశారు. ఇంకొన్ని చోట్ల సభ్యులగా చేరిన కౌలు రైతులకు మాయలు మాటలు చెప్పి, వారితో సంతకాలు చేయించి, వారికి తెలియకుండా రుణాలు తీసేసుకున్నారు.
 
  కొన్ని సొసైటీల్లో షేర్  క్యాపిటల్‌కు  సంబంధం లేకుండా రుణాలిప్పించి,  కుట్ర పూరితంగా నిధులు దుర్వినియోగం చేశారు. సాధారణంగా సొసైటీలో సభ్యునిగా చేరితే రూ.300 షేర్ క్యాపిటల్‌తో  పాటు రూ. 30అడ్మినిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. అలా చెల్లించిన వారికి ప్రతీ పది రూపాయలకు వేయి రూపాయలు చొప్పున రుణం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ మేరకే బోర్డు సమావేశంలో రుణ పరపతి పరిమితి నిర్ధేశిస్తారు. ఆ ప్రకారం రుణాలు ఇవ్వాలి. అయితే,చాలా సొసైటీల్లో అడ్డగోలుగా రుణాలు ఇచ్చేసినట్టు తెలిసింది.  కొన్ని సొసైటీల్లో అసలు వ్యక్తికి  తెలియకుండా సభ్యత్వం తీసుకుని, వారి పేరుతో ఫోర్జరీ సంతకాలు చేసి రుణాలు తీసేసుకున్నారు.
 
  ఇంకొన్ని సొసైటీల్లో  ఒకే బాండ్‌తో సభ్యుడికి తెలియకుండా  రెండు మూడు పర్యాయాలు రుణాలు తీసుకున్నారు. సాధారణంగా ఒక సభ్యుడు రూ.10వేలు రుణం తీసుకుంటే ఆ మేరకు ఆయన పేరున బాండ్ ఇవ్వాలి. అందులో తీసుకున్న రుణం వివరాలు ఉండాలి.  తీసుకున్న రుణం తిరిగి చెల్లిస్తే ఆ బాండ్‌ను రద్దు చేసి, నో డ్యూస్ సర్టిఫికేట్ ఇవ్వాలి. కానీ జిల్లాలో అందుకు భిన్నమైన సంప్రదాయం కొనసాగుతోంది. సభ్యుని పేరున తయారు చేసిన బాండ్‌లో ఎక్కడా వివరాలు పేర్కొనడం లేదు. ఖాళీగా ఉంచేసి సభ్యుని చేత సంతకాలు పెట్టించేస్తున్నారు.   సభ్యునికి తెలియకుండా పాత బాండ్‌లపైనే కొందరు  రుణాలు పొందుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement