రెండు లారీలు ఢీకొని ఒకరి దుర్మరణం | Least one of the two trucks collide | Sakshi
Sakshi News home page

రెండు లారీలు ఢీకొని ఒకరి దుర్మరణం

Jan 7 2014 2:47 AM | Updated on Sep 2 2017 2:21 AM

రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలైన సంఘటన మండలంలోని పెద్దనాగారం స్టేజీ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది.

=ముగ్గురికి గాయాలు
 =ప్రమాదానికి గురైన లారీలను ఢీకొన్న మరో రెండు లారీలు
 =ఇరువైపులా నిలిచిపోయిన వాహనాలు

 
నర్సింహులపేట, న్యూస్‌లైన్ : రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలైన సంఘటన మండలంలోని పెద్దనాగారం స్టేజీ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్సై ఎల్లావుల వెంకటప్రసాద్, స్థానికుల కథనం ప్రకారం... ఖమ్మం నుంచి వరంగల్ వైపు చేపల లోడుతో ఒక లారీ బయల్దేరగా.. వరంగల్ నుంచి ఖమ్మం వైపు ఎర్రమట్టి లోడుతో వెళుతున్న మరో లారీ వెళుతోంది.

ఈ రెండు లారీలు వరంగల్-ఖమ్మం రహదారిపై పెద్దనాగారం స్టేజీ సమీపంలోని విజ్ఞాన్ హైస్కూల్‌కు ఎదురుగా సోమవారం  తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో ఢీకొన్నారుు. ఈ ప్రమాదంలో ఎర్రమట్టి లారీలో ప్రయాణిస్తున్న క్లీనర్ నిమ్మికంటి రాకేష్(23) అక్కడికక్కడే మృతిచెందగా, డ్రైవర్ వెంకన్నకు గాయూలయ్యూయి. అలాగే చాపలలోడ్ లారీలో ప్రయూణిస్తున్న కృష్ణా జిల్లా మదనపల్లికి చెందిన డ్రైవర్ పులిగెటి రాయుడు, క్లీనర్ సాయికి తీవ్ర గాయాలయ్యూయి. మృతుడు రాకేష్ నల్లగొండ జిల్లా హూజుర్‌నగర్ వాస్తవ్యుడని తెలిసింది.

సమాచారం అందుకున్న ఎస్సై వెంకటప్రసాద్ తన సిబ్బందితో హుటాహుటిన మరిపెడ నుంచి జేసీబీని తెప్పించి రెండు లారీలను విడదీసి రాకేష్ మృతదేహాన్ని బయటికి తీశారు. అలాగే క్షతగాత్రులను 108లో ఆస్పత్రికి తరలించారు. రెండు లారీలు నడిరోడ్డుపై ఢీకొనడంతో వాటిని తీయడానికి జేసీబీ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయంది. దీంతో రోడ్డు పక్క నుంచి దారి ఏర్పాటు చేసి వాహనాలను పంపించారు.
 
ప్రమాదం జరిగిన చోటే మళ్లీ ప్రమాదం..
 
జేసీబీతో రోడ్డుపై ఉన్న లారీలను తీస్తున్న క్రమంలోనే తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో మంచు కురుస్తుండగా దారి కనిపించకపోవడంతో ఖమ్మం వైపు వెళుతున్న గ్రానైట్‌లోడ్ లారీ ప్రమాదానికి గురైన ఎర్రమట్టి లారీని ఢీకొంది. కొద్దిసేపటికే ఖమ్మం నుంచి వచ్చిన మరో చేపలలోడ్ లారీ ప్రమాదానికి గురైన చేపల లారీని ఢీకొంది. ఈ ఘటనల్లో డ్రైవర్, క్లీనర్లకు ఎలాంటి నష్టం జరగనప్పటికీ నాలుగు లారీలు రోడ్డుపై నిలిచిపోవడంతో పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయంది. దీంతో ఎస్సై వెంకటప్రసాద్ వెంటనే మరో జేసీబీని తెప్పిం చారు.

ఆయన ఆధ్వర్యంలో పీఎస్సై నాగభూషణం, హెడ్‌కానిస్టేబుల్ రవీందర్, కానిస్టేబుళ్లు బుచ్చిరాజు, పాషా, సురేష్, జ్ఞానేశ్వర్ శ్రమించి రెండు జేసీబీలతో లారీలను రోడ్డు పక్కకు తరలించి ఇరువైపులా రెండు కిలోమీటర్ల దూరంలో నిలిచిన వాహనాలను పంపించారు. ఖమ్మం వెళ్లే వాహనాలను నర్సింహులపేట మీదుగా, వరంగల్ వెళ్లే వాటిని పెద్దనాగారం గ్రామం మీదుగా మళ్లించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటప్రసాద్ తెలిపారు.  

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement