జస్టిస్‌ నాగార్జునరెడ్డికి బాసట | lawyer's support to justice nagarjuna reddy | Sakshi
Sakshi News home page

జస్టిస్‌ నాగార్జునరెడ్డికి బాసట

Dec 15 2016 2:50 AM | Updated on Sep 4 2017 10:44 PM

జస్టిస్‌ నాగార్జునరెడ్డికి బాసట

జస్టిస్‌ నాగార్జునరెడ్డికి బాసట

ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డికి హైకోర్టు న్యాయవాదులు బాసటగా నిలిచారు.

అభిశంసన నోటీసు విషయంలో జోక్యం చేసుకోండి
రామకృష్ణవి నిరాధార, తప్పుడు ఆరోపణలు
రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్, సీజేఐలకు న్యాయవాదుల వినతి


సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డికి హైకోర్టు న్యాయవాదులు బాసటగా నిలిచారు. ఆయనపై 50 మందికి పైగా రాజ్యసభ సభ్యులు అభిశంసన నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని వారు బుధవారం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, రాజ్యసభ చైర్మన్‌ హమీద్‌ అన్సారీ, , ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.ఎస్‌.ఠాకూర్, ఉభయ రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ను కోరారు. ఈ మేరకు ఓ వినతిపత్రంపై సుమారు 1,050 మంది న్యాయవాదులు సంతకాలు చేసి దానిని రాష్ట్రపతి తదితరులకు పంపారు. ఈ సందర్భంగా వారు ఈ మొత్తం వ్యవహారంలో చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. జస్టిస్‌ నాగార్జునరెడ్డిపై సస్పెన్షన్‌లో ఉన్న న్యాయాధికారి రామకృష్ణ ఏ మరణ వాంగ్మూలం గురించి ఆరోపణలు చేశారో ఆ వాంగ్మూలాన్ని, 13 ఫిబ్రవరి 2013న నాగార్జునరెడ్డి తనను ఆయన ఇంటిలో కొట్టారన్న ఆరోపణలకు సంబంధించి ఆ రోజు రామకృష్ణ సెలవులో ఉన్నట్లు రుజువు చేసే సెలవు పత్రాన్ని జత చేసి పంపారు. నిజాయితీతో నిర్భయంగా విధులు నిర్వర్తించే ఓ న్యాయమూర్తి ప్రతిష్టను దెబ్బతీసే యత్నాలను మొగ్గలోనే తుంచి వేయాలని కోరారు. లేనిపక్షంలో భవిష్యత్తులో ప్రతీ న్యాయమూర్తీ ఇలాగే వ్యక్తుల ప్రయోజనాలకు లక్ష్యాలుగా మారుతారని వివరించారు. 1050 న్యాయవాదులు తమ వినతిపత్రంలో తమ ఆరోపణలను పూర్తిగా వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement