విజయ్‌ సర్కార్‌ ఎఫెక్ట్‌.. 162 మంది న్యాయవాదుల రాజీనామా | DMK Related 162 lawyers resign in tamil nadu | Sakshi
Sakshi News home page

విజయ్‌ సర్కార్‌ ఎఫెక్ట్‌.. 162 మంది న్యాయవాదుల రాజీనామా

May 27 2026 7:50 AM | Updated on May 27 2026 7:50 AM

DMK Related 162 lawyers resign in tamil nadu

సాక్షి, చైన్నె: తమిళనాడులో కొత్తగా తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనా విభాగాల్లో ప్రక్షాళన ఊపందుకుంది. ఇందులో భాగంగా, గత డీఎంకే ప్రభుత్వ హయాంలో చైన్నె హైకోర్టు, , హైకోర్టు మదురై బెంచ్‌లలో నియమితులైన 162 మంది ప్రభుత్వ న్యాయవాదుల రాజీనామాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎన్నికల ఫలితాల తర్వాత రాజీనామాలు
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘనవిజయం సాధించి, ముఖ్యమంత్రి సి. జోసెఫ్‌ విజయ్‌ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. డీఎంకే లీగల్‌ వింగ్‌కు చెందిన ఈ న్యాయవాదులందరూ నైతిక బాధ్యతగా తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే, కొత్త ప్రభుత్వ న్యాయవాదులను నియమించేంత వరకు విధుల్లో కొనసాగాల్సిందిగా అప్పట్లో ప్రభుత్వం వారిని కోరింది. తాజాగా నూతన న్యాయవాదుల నియామక ప్రక్రియ తుది దశకు చేరడంతో, వీరి రాజీనామాలను ఆమోదిస్తూ జీవో విడుదల చేశారు. స్టేట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌ ఎడ్విన్‌ ప్రభాకర్‌తో పాటుగా మద్రాసు హైకోర్టులో 24 మంది న్యాయవాదులు, 36 మంది అదనపు న్యాయవాదులు, మరో 54 ప్రత్యేక న్యాయవాదులు రాజీనామాలు ఆమోదించారు. అలాగే, హైకోర్టు మదురై బెంచ్‌ ప్రభుత్వ ప్లీడర్‌ పి. తిలక్‌కుమార్‌తో పాటుగా ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదులు 9 మంది, అదనపు న్యాయవాదులు 16 మంది, ఇతర న్యాయవాదులు 21 మంది ఈ జాబితాలో ఉన్నారు.

కొత్త నియామకాలపై ఉత్కంఠ
తమిళనాడు ప్రభుత్వానికి కోర్టుల్లో బలమైన వాదనలు వినిపించేందుకు వీలుగా.. కొత్త ముఖ్యమంత్రి విజయ్‌ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం తమ పార్టీకి చెందిన సమర్థులైన న్యాయవాదులను త్వరలోనే ఈ స్థానాల్లో నియమించనుంది. ఇప్పటికే మంగళవారం జరిగిన రిజర్వేషన్ల అత్యవసర సమీక్షలో కొత్త అడ్వకేట్‌ జనరల్‌ విజయ్‌ నారాయణ్‌ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, హైకోర్టుకు రాబోయే కొత్త ప్రభుత్వ ప్లీడర్లు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల జాబితాపై న్యాయవాదులలో ఆసక్తి నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement