మొరాయించిన ఓడ : 2000 మంది పడిగాపులు | Late departure of Ship causes Technical issue | Sakshi
Sakshi News home page

మొరాయించిన ఓడ : 2000 మంది పడిగాపులు

Jun 5 2015 7:03 PM | Updated on Sep 3 2017 3:16 AM

షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విశాఖ నుంచి అండమాన్ వెళ్లే నౌక సాంకేతిక సమస్యలతో శుక్రవారం మొండికేసింది.

విశాఖపట్నం :  షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విశాఖ నుంచి అండమాన్ వెళ్లే నౌక సాంకేతిక సమస్యలతో శుక్రవారం మొండికేసింది. ఇంజన్‌లో సమస్య తలెత్తడంతో ఉదయం 11.30 గంటలకు వెళ్లాల్సిన నౌక సాయంత్రం 6గంటలకు బయలుదేరింది. దీంతో 2వేల మంది ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. విశాఖ పోర్టు నుంచి అండమాన్‌లోని పోర్టు బ్లెయిర్ వరకూ ప్రతి నెలా నౌకను షిప్పింగ్ కార్పొరేషన్ నుంచి అనుమతి పొందిన ప్రైవేట్ కాంట్రాక్టర్ నడుపుతున్నారు. 1100 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణానికి రూ.2,500 నుంచి రూ.9వేల వరకూ కేటగిరీల వారీగా టిక్కెట్టు డబ్బులు వసూలు చేస్తున్నారు.

యాభై ఆరు గంటల పాటు ప్రయాణించాల్సి ఉండటంతో ప్రయాణీకులు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటారు. చెన్నై, కోల్‌కత్తా పోర్టుల తర్వాత అండమాన్‌కు విశాఖ నుంచే నౌకాయానం అందుబాటులో ఉంది. చెన్నై, కోల్‌కత్తా నుంచి వెళ్లడం కంటే విశాఖ నుంచి వెళితే నాలుగు గంటలు ముందుగానే పోర్ట్‌ బ్లెయిర్ చేరుకోవచ్చు. కాగా అండమాన్ నౌక ఆలస్యమవ్వడం కొత్తకాదు. గతంలోనూ అనేక సార్లు ఇదే విధంగా ఇబ్బందులు పెట్టింది. ఒక్కోసారి రెండు మూడు రోజుల పాటు నిలిచిపోయిన సందర్భాలున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement