కృష్ణా డెల్టాకు 20 నుంచి నీళ్లివ్వండి | krishna irrigation officials seek water to delta from 20th | Sakshi
Sakshi News home page

కృష్ణా డెల్టాకు 20 నుంచి నీళ్లివ్వండి

Jul 18 2014 3:09 AM | Updated on Sep 2 2017 10:26 AM

కృష్ణాడెల్టా తాగునీటి అవసరాల కోసం ఈ నెల 20 నుంచి మూడో విడత తాగునీటిని విడుదల చేయాలని కృష్ణా జిల్లా ఇరిగేషన్ అధికారులు శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్‌ను కోరారు.

ఈఎన్‌సీకి కృష్ణా ఇరిగేషన్ అధికారుల లేఖ

సాక్షి, విజయవాడ బ్యూరో:  కృష్ణాడెల్టా తాగునీటి అవసరాల కోసం ఈ నెల 20 నుంచి మూడో విడత తాగునీటిని విడుదల చేయాలని కృష్ణా జిల్లా ఇరిగేషన్ అధికారులు శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్‌ను కోరారు. ఈ మేరకు అధికారులు గురువారం నీటి విడుదల వివరాలతో కూడిన ప్రతిపాదనల్ని హైదరాబాద్‌కు పంపారు. కృష్ణాడెల్టాకు తొలుత కేటాయించిన 10 టీఎంసీల నీటిలో ఇప్పటివరకు రెండు విడతలుగా 7.12 టీఎంసీల నీటిని విడుదల చేశారు.

ఇటీవల జరిగిన కృష్ణా వాటర్ బోర్డు సమావేశంలో మిగతా 2.88 టీఎంసీల నీటిని కూడా విడుదల చేయాలని, ఈ విషయమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈఎన్‌సీలు చర్చించుకుని నిర్ణయం తీసుకోవాలని సీడబ్ల్యూసీతో పాటు బోర్డుకు చైర్మన్‌గా ఉన్న పాండ్యా సూచించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కృష్ణాడెల్టా ఎస్‌ఈ శ్రీనివాస్ రెండు రోజుల కిందట షెడ్యూల్‌ను పంపారు. వీటిని పరిశీలించిన నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఈ నెల 18 నుంచి మూడో విడత నీటిని తీసుకోవాల్సిందిగా సూత్రప్రాయంగా తెలిపారు.

అయితే ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద నిల్వ ఉన్న నీటిని తూర్పు, పశ్చిమ కాల్వలకు పూర్తిస్థాయిలో విడుదల చేశాక, డ్యాం నుంచి నీటిని తీసుకోవాలని ఇక్కడి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గురువారం తాజాగా ఈఎన్‌సీకి మరో లేఖ రాశారు. ఈ నెల 20 నుంచి రోజుకు 5 వేల క్యూసెక్కుల చొప్పున 6 రోజుల పాటు నీటిని విడుదల చేస్తే డెల్టా తాగునీటి అవసరాలు తీరగలవని ఆ లేఖలో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement