కియాపై కీలక ప్రకటన.. | KIA Motors Gives Clarity Over Plant Moving Out News From AP | Sakshi
Sakshi News home page

ఏపీలోనే కియా

Feb 8 2020 3:03 AM | Updated on Feb 8 2020 7:59 AM

KIA Motors Gives Clarity Over Plant Moving Out News From AP - Sakshi

కియా ఎండీ కుక్‌యున్‌ షిమ్‌

తమ అనంతపురం ప్లాంటు వేరే ప్రాంతానికి తరలి వెళుతోందంటూ వచ్చిన వార్తలో నిజం లేదంటూ కియా మోటర్స్‌ స్పష్టం చేసింది.

సాక్షి, అమరావతి: తమ అనంతపురం ప్లాంటు వేరే ప్రాంతానికి తరలి వెళుతోందంటూ వచ్చిన వార్తలో నిజం లేదంటూ కియా మోటర్స్‌ స్పష్టం చేసింది. తప్పుడు కథనాలను పట్టించుకోవద్దని సూచించింది. సమర్థుడైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయని వెల్లడించింది. దీర్ఘకాలిక లక్ష్యంతో అనంతపురంలో 1.1 బిలియన్‌ డాలర్లతో యూనిట్‌ను ఏర్పాటు చేశామని, ఇక్కడి నుంచే ప్రపంచస్థాయి కార్లను తయారుచేసి వినియోగదారులకు అందిస్తామని తెలిపింది. ఈ మేరకు కియా మోటర్స్‌ ఎండీ కుక్‌యున్‌ షిమ్‌ లేఖ రాశారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఆటోఎక్స్‌పోలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితో కలసి కియా ప్రతినిధులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

కియా ఎండీ కుక్‌యున్‌ షిమ్‌ రాసిన లేఖను కియా ప్రతినిధులు చదివి వినిపించారు. ఈ సందర్భంగా కియా జనరల్‌ మేనేజర్‌ సన్‌ ఊక్‌ వాంగ్‌ మాట్లాడుతూ.. కియా సంస్థకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో ఉన్న బంధం చెక్కు చెదరదని, కలసిమెలిసి ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. రాయిటర్స్‌ రాసిన తప్పుడు కథనంపై న్యాయపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. కియా మోటార్స్‌ ఎక్కడికీ వెళ్లదని, రానున్న కాలంలో మరిన్ని ఆటో మొబైల్‌ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయన్నారు.

తమ ప్రభుత్వ సహకారంతోనే కియా మోటార్స్‌ రెండో మోడల్ని తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోందని చెప్పారు. కియో మోటార్స్, తమిళనాడు ప్రభుత్వం కూడా అసత్య ప్రచారాన్ని ఖండించిందని, అయినా కొందరు కావాలనే స్వార్థ ప్రయోజనాల కోసం ప్రచారం కొనసాగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కియాపై బాధ్యతరాహిత్యంతో ఆరోపణలు చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు వివరణ ఇవ్వాలని మంత్రి డిమాండ్‌ చేశారు. ఎంతో రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఇంత దుష్ప్రచారాలకు తెరతీయడం రాజకీయంగా దిగజారడమేనన్నారు. (చదవండి: రాయిటర్స్‌కు బాబు సర్కారు పందేరం)

Advertisement
 
Advertisement
Advertisement