
ఢిల్లీకి కేసీఆర్
టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ఆదివారం రాత్రి ఢిల్లీకి బయలుదేరారు.
సాక్షి, హైదరాబాద్:టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ఆదివారం రాత్రి ఢిల్లీకి బయలుదేరారు. ఆహార భద్రత బిల్లుపై పార్లమెంటులో ఓటింగ్ జరిగితే అందుకు అనుకూలంగా ఓటు వేయడానికి ఆయన ఢిల్లీ వెళ్లినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి పార్లమెంటు సమావేశాలు పొడిగించే అవకాశాలున్నాయనే కారణంతో ఢిల్లీకి రెండుమూడ్రోజుల తర్వాత వెళ్లాలని అనుకున్నారు. అయితే యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆహార భద్రత బిల్లుపై పార్లమెంట్లో సోమవారం ఓటింగ్ జరిగే అవకాశముందని ఆదివారం ఉదయమే కేసీఆర్కు సమాచారం అందినట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ ఓటింగ్ జరిగితే అనుకూలంగా ఓటేయకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించి ఢిల్లీకి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి, జి.జగదీశ్రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ వెళ్లడానికి ముందు ఆయన నివాసం వద్ద నిరీక్షించిన మీడియాతో కేసీఆర్ మాట్లాడకుండా నేరుగా కారెక్కి విమానాశ్రయానికి వెళ్లిపోయారు. ఆహార భద్రతపై ఉన్నట్టుగానే తెలంగాణపై యూపీఏ ప్రభుత్వం అంతే కచ్చితంగా ఉందని, ఆహార భద్రత బిల్లుపై యూపీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తే తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడం ఇదే తొలిసారి. తెలంగాణపై నిర్ణయం నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎవరైనా కేసీఆర్ను పిలిచారా? అందుకే ఢిల్లీ వెళ్తున్నారా అన్న ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలంగాణకు అనుకూలంగా సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించిన సందర్భంగా కాంగ్రెస్ నేత దిగ్విజయ్సింగ్ టీఆర్ఎస్ విలీనం విషయంపైనా మాట్లాడారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తామని చేసిన ప్రకటనను ప్రస్తావించారు. అయితే ఆ తర్వాత విలీనానికి సంబంధించి కాంగ్రెస్ నుంచి ఎలాంటి సంకేతాలు టీఆర్ఎస్కు రాలేదని చెబుతున్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఆంటోని నేతృత్వంలో కమిటీ వేసినా, తాజాగా మరో అధికారిక కమిటీ వేస్తున్నట్టు సోనియాగాంధీ చెప్పిన విషయాలపై టీఆర్ఎస్ స్పందించలేదు.
అయినప్పటికీ కాంగ్రెస్తో సానుకూలంగా ఉండాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ ఆహార భద్రత బిల్లు విషయంలో మద్దతునివ్వాలని నిర్ణయించి ఢిల్లీ బయలుదేరారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన కాంగ్రెస్ ముఖ్యులను కలిసే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆ సందర్భంగా పార్టీ విలీనం అంశం చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు విలీనం విషయంలో కాంగ్రెస్ ఏమాత్రం తొందరపాటుతో లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ నేతలు విజయశాంతి, విజయరామారావు, చంద్రశేఖర్ తదితర నేతలను చేర్చుకోవడం ద్వారా విలీనం విషయంలో కాంగ్రెస్ తొందరపడటం లేదన్న విషయం కేసీఆర్కు అర్థమైందని అంటున్నారు.