స్విమ్స్‌లో విద్యార్థి మృతిపై ఆందోళన

Inter Student Died in Swims Chittoor - Sakshi

వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని ఆరోపణ

బాధిత కుటుంబానికి అండగా నిలిచిన వైఎస్సార్‌ సీపీ

విచారణ చేసి చర్యలు తీసుకుంటామని అధికారుల హామీ

చిత్తూరు, తిరుపతి (అలిపిరి): స్విమ్స్‌ నెఫ్రాలజీ ఐసీయూలో చికిత్స పొందుతున్న ఇంటర్‌ ప్రథమ సంవత్సరవిద్యార్థి చేకుర్తి చరణ్‌(16) కిడ్నీ సమస్యలతో గత 15 రోగులుగా ఇక్కడ వైద్య సేవలు పొందుతున్నాడు. వైద్యులు, నర్సుల నిర్లక్ష్య వైద్యం వల్లే విద్యార్ధి మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు సోమవారం ఆస్పత్రిలోని ఎన్టీఆర్‌ కూడలి వద్ద ఆందోలనకు దిగారు. వీరికి  వైఎస్సార్‌ సీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. మృతుని కుటుంబ సభ్యుల కథనం..పొట్టి శ్రీరాములు జిల్లా  డక్కిలి మండలం, తిమ్మనగుంటకు చెందిన సి.చరణ్‌(15) కిడ్నీ సమస్యలతో ఈనెల 7న స్విమ్స్‌ అత్యవసర విభాగానికి తీసుకొచ్చారు.

అత్యవసర విభాగంలో ఆర్యోగ్యం కాస్త మెరుగు పడడంతో ఆదివారం అతడిని నెఫ్రాలజీ ఐసీయూ విభాగానికి తరలించారు. అయితే రాత్రి 9.30 గంటలకు తీవ్రమైన జ్వరంతో పాటు రక్తవాంతులు చేసుకున్నాడు. తల్లిదండ్రులు విషయాన్ని విధుల్లో ఉన్న నర్సులకు చెప్పినా పట్టించుకోలేదు. అత్యవసర విభాగంలోని వైద్యుల వద్దకు వెళ్లి తన కుమారుడి పరిస్థితి దయనీయంగా ఉందని విద్యార్థి తల్లిదండ్రులు ప్రాధేయపడ్డారు. ఉదయం వస్తామని వైద్యులు సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం వేకువజామున 12.30 గంటలకు విద్యార్థి ప్రాణాలు విడిచాడు. సరైన వైద్యసేవలు అందకపోవడం వల్లే చరణ్‌ మృతి చెందాడని బంధువులు ఆగ్రహించారు. ఉదయం 9 నుంచి 11 గంటలకు వరకు ఆస్పత్రిలో ఆందోళన చేశారు. స్విమ్స్‌ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం మహాప్రస్థాన వాహనంలో విద్యార్థి మృతదేహాన్ని నెల్లూరుకు తరలించారు.

వైఎస్సార్‌ సీపీ మద్దతు
వైద్యుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థి స్విమ్స్‌లో మృతి చెం దాడన్న విషయం తెలుసుకున్న  వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కట్టా గోపి యాదవ్, బీసీ సెల్‌ న గర అధ్యక్షులు తండ్లం మోహన్‌ యాదవ్, నాయకులు వేణుగోపాల్, విజయలక్ష్మి, చాన్‌బాషా, వూటుగుంట మోహన్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. బాధిత కు టుం సభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు.  స్విమ్స్‌లో వైద్య సేవలు రోజు రోజూకు దిగజారుతున్నాయ ని ఆరోపించారు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి జిల్లాలో మరొకటి లేకపోవడం వల్ల విధిలేని పరిస్థితిలో రోగులు స్విమ్స్‌కు వస్తున్నారని, అయితే రోగుల ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు, నర్సులు కొన్ని సమయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

నా బిడ్డ ప్రాణాలు తీశారు
వైద్యసేవలు సరిగా అందించకపోవడం వల్లే తమ బిడ్డ మృత్యువాత పడ్డాడని చరణ్‌ తల్లిదండ్రులు పా ర్వతి, భాస్కర్‌ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రాణాపా య స్థితిలో ఉన్న తమ బిడ్డకు సరైన సమయంలో  చికిత్స చేయలేదన్నారు. ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు పొందుతున్న రోగులను చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ కుమారుడి మృతికి కారకులైన వైద్యులు, నర్సులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

విచారణ చేసి చర్యలు తీసుకుంటాం
చరణ్‌కు స్విమ్స్‌లో మెరుగైన వైద్య సేవలు అందించామని స్విమ్స్‌ వైద్యులు డాక్టర్‌ అల్లోక్‌ సచన్, డాక్టర్‌ రామ్‌ తెలిపారు. మృతుడి తల్లిదండ్రుల ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని ఘటనపై ప్రత్యేక కమిటీతో సమావేశమై విచారణ చేస్తామన్నారు. ఇందులో వైద్యులు, నర్సులు నిర్లక్ష్యం ఉందని తేలితే చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబ సభ్యులకు అధికారులు  హామీ ఇచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top