కిడారి కొవ్వు కేక | Illegal excavations in the quarry | Sakshi
Sakshi News home page

కిడారి కొవ్వు కేక

Jul 13 2016 2:48 AM | Updated on Sep 4 2017 4:42 AM

సాక్షి దినపత్రికలో రెండు రోజులుగా వస్తున్న కథనాలపై అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తీవ్రంగా స్పందించారు.

సాక్షి దినపత్రికలో  రెండు రోజులుగా వస్తున్న కథనాలపై అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. అనంతగిరి మండలం శివలింగపురంలోని మౌంటేన్ వ్యూ ప్రైవేటు అతిథి గృహంలో  మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆవేశంతో ఊగిపోయారు. ఎవరో తన పేరు చెప్పి భూములు కొనుగోలు చేస్తే తానే కొన్నానని చెప్పడం సరికాదన్నారు. వాలసీ ప్రాంతంలో శెట్టి గంగాధరస్వామి మేనల్లుడు ముత్యాలు పేరున మైనింగ్ లీజు  ఉందని చెప్పుకొచ్చారు. ముత్యాలు కష్టాల్లో ఉంటే సహాయం చేశానే గానీ తనకు  మైనింగ్‌తో సంబంధం లేదన్నారు. హుకుంపేట మండలంలో క్వారీ తప్ప మైన్స్ ఏమీ లేవ ని తెలిపారు. ప్రభుత్వ  అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై చర్య తీసుకోవాలన్నారు. మీ పేరు చెప్పి అక్రమాలు పాల్పడిన వాళ్లపై చర్యలు తీసుకుంటారా... అని విలేకరులు ప్రశ్నించగా ఆయన నుంచి సరైన సమాధానం రాలేదు. సాక్షితో పాటు ఇతర పత్రికల్లో కూడా భూదందాపై కథనాలు వచ్చాయని ప్రస్తావించినా ఆయన పట్టించుకోకుండా ఒక్క సాక్షినే లక్ష్యంగా చేసుకొని కువిమర్శలు చేశారు.
 
ఆ జరిమానా ఏమైందో తెలుసుకుంటా..
ఆ క్వారీలో అక్రమ తవ్వకాలపై జరిమానా విధించిన విషయం నాకు తెలియదు. నేను ఇటీవలే బాధ్యతలు చేపట్టాను. మైనింగ్ అధికారులు జరిమానా విధించి ఉంటారు. ఆ తర్వాత ఏమైందో తెలుసుకుని జరిమానా వసూలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాను.
 - ఎల్.శివశంకర్, సబ్‌కలెక్టర్

రెవెన్యూ రికవరీ యాక్ట్‌కు పంపించాం
 అది కచ్చితంగా అక్రమ క్వారీనే. అక్రమ మైనింగ్ పై దాడులు చేసి కేసు నమోదు చేశాం. నోటీసులు ఇచ్చాం. అయినా బకాయిలు చెల్లించకపోవడం తో చివరికి రెవెన్యూ రికవరీ యాక్ట్‌కు రిఫర్ చేశాం. -కె.సుబ్బారావు, మైనింగ్ విజిలెన్స్ ఏడీ
 
 

Advertisement
 
Advertisement
Advertisement