పిడికిలెత్తిన ఆగ్రహాంధ్ర | Adivasi march against mining | Sakshi
Sakshi News home page

పిడికిలెత్తిన ఆగ్రహాంధ్ర

Jul 23 2026 5:03 AM | Updated on Jul 23 2026 5:03 AM

Adivasi march against mining

చంద్రబాబు సర్కారుపై సమరభేరి  

వేతన సవరణ కోసం సహకార బ్యాంక్‌ అధికారులు ఉద్యమబాట  

ఉద్యోగ భద్రత కోసం కదంతొక్కిన గిరిజన ఉపాధ్యాయులు  

గిట్టుబాటు ధర కోసం అన్నదాతల ఆక్రందన   

మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆదివాసీల పాదయాత్ర  

చంద్రబాబు పాలనలో దగాపడిన అన్నివర్గాల ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారు. పిడికిలెత్తి ఆందోళన బాట పడుతున్నారు. సమస్యలపై తాత్సారం చేస్తున్న సర్కారుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. బుధవారం సహకారబ్యాంక్‌ అధికారులతోపాటు, గిరిజన ఉపాధ్యాయులు, రైతులు, ఆదివాసీలు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే బాబు సర్కారును గద్దె దింపుతామని ప్రతినబూనారు.  

సహకార బ్యాంకులో వేతన సవరణ నినాదం
సాక్షి, అమరావతి: వేతన సవరణ అమలు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని ఏపీ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ (ఏపీసీసీబీ) అధికారుల సంఘం హెచ్చరించింది. బుధవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు విజయవాడ ప్రాంతీయ కార్యాలయం ఎదుట అధికారులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి నన్నపనేని రంగబాబు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల సీఈఓలు, జనరల్‌ మేనేజర్లు, డిప్యూటీ జనరల్‌ మేనేజర్ల వేతన సవరణను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సీనియర్‌ అధికారుల వేతన సవరణను పెండింగ్‌లో పెట్టడం దారుణమన్నారు. 

ఉద్యోగుల న్యాయమైన వేతన హక్కులను కోర్టు కేసులతో ముడిపెట్టడం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళనను దశలవారీగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 27న సామూహిక సెలవు పెట్టి నిరసన తెలియజేయబోతున్నామని, 31న విజయవాడలో మహాధర్నాకు పిలుపునిచ్చామని పేర్కొన్నారు. బుధవారం నాటి ఆందోళనలో బ్యాంక్‌ డీజీఎంలు పి.వరాలమ్మ, కాగిత శ్రీనివాసులు బ్యాంకు ఉద్యోగ సంఘ ప్రధాన కార్యదర్శి ఎస్‌ గోపీనాథ్, బ్యాంకు ఉద్యోగ సంఘ నాయకులు వై.గీతాభారతి,  ఎం.మౌలేశ్వరరావు, రేష్మ, బ్యాంకు ఉద్యోగులు సహకార సంఘాల ఉద్యోగులు పాల్గొన్నారు.

రగిలిన గిరిజన గురువు
లబ్బీపేట(విజయవాడతూర్పు):  ‘‘రాష్ట్రంలోని గిరిజన గురుకుల రెసిడెన్షియల్‌ స్కూళ్లలో పదిహేనేళ్లు పాటు పనిచేశాం. ఇప్పుడు డీఎస్సీలో పోస్టులు భర్తీ చేశామంటూ, మా ఉద్యోగాలు తొలగిస్తే ఎలా?’’ అంటూ గిరిజన ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. తమ అందరికీ రెన్యువల్‌ చేస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. విజయవాడలోని గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌ కార్యాలయం ఎదుట బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో చేపట్టిన ఆందోళన సాయంత్రం 6 గంటలు దాటేవరకు కొనసాగింది. 

ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ గిరిజన గురుకుల రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో అవుట్‌సోర్సింగ్‌ పద్దతిలో దాదాపు 1450 మంది ఉపాధ్యాయులం పనిచేసేవారమని, అయితే ఇటీవల డీఎస్సీలో  గిరిజన పాఠశాలల పోస్టులు భర్తీచేశామని సాకుగా చెప్పి దాదాపు 700 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో గిరిజన మంత్రిని నిలదీయగా, ఎవరికీ అన్యాయం జరగదని హామీ ఇచ్చి ఇంతవరకు మాట నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.    

కదంతొక్కిన కర్షకులు
తిరుపతి అర్బన్‌: ప్రతి పంటకూ గిట్టుబాటు ధర కల్పించాలని కర్షకులు కదంతొక్కారు. రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం తిరుపతి కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం తిరుపతి జిల్లా కార్యదర్శి పి.హేమలత మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడని, ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదని విమర్శించారు. రాయితీ విత్తనాలు ఇవ్వకపోవడంతో రైతులు విత్తు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

బాబు పాలనలో ఎరువుల సమస్య కూడా వేధిస్తోందని ధ్వజమెత్తారు.ఎన్నికల ముందు రైతులకు అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చిన సర్కారు ఇప్పుడు వారిని వంచించిందని దుయ్యబట్టారు. రైతులు చూస్తూ ఊరుకోబోరని, ఆందోళనను తీవ్రతరం చేస్తారని హెచ్చరించారు.  కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు  మణి, చెంగల్‌రాయుల రెడ్డి, సంజీవరెడ్డి, సందీప్‌ రెడ్డి, త్యాగరాజుల రెడ్డి, మునిరామయ్య, సుబ్రమణ్యం, శంకరయ్య, భారతి తదితరులు పాల్గొన్నారు.

మైనింగ్‌పై ఆదివాసీల ఆందోళన
రావికమతం (అనకాపల్లి జిల్లా): మండలంలో చీమలపాడు పంచాయతీ కళ్యాణపులోవను నో మైనింగ్‌ గా ప్రకటించాలని బుధవారం ఆదివాసీలు సోంపురం వంద నుంచి కళ్యాణపులోవ వరకు పాదయాత్ర నిర్వíహించి ఆందోళన చేపట్టారు. మండలంలో చీమలపాడు పంచాయతీలో కళ్యాణపులోవ రిజర్వాయరు గర్భం 258 ఎకరాలు. కాగా రిజర్వాయరుపై ఆధారపడి 9 గ్రామాల ప్రజలు సుమారుగా 4,484 ఎకరాలను వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తున్నారు. 

అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రానైట్‌ క్వారీలు నడిపేవారు. అప్పటిలో ఆదివాసీలు, ప్రజా సంఘాలు, సీపీఐ, సీపీఎం నాయకులు పలుమార్లు నిరసనలు, ధర్నాలు, పాదయాత్రలు నిర్వహించడంతో క్వారీలు నిలుపుదల చేశారు. అయితే కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత భూ మాఫియా, మైనింగ్‌ మాఫియా రెచ్చిపోతున్నాయని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు. కళ్యాణపులోవను నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 

కళ్యాణపులోవ పోతురాజుబాబు ఆలయం ఉత్తరాంధ్రలోనే ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రం అని, ఇంతంటి ప్రాశస్త్యం ఉన్న క్షేత్రాన్ని  మైనింగ్‌ మాఫియా నుంచి కాపాడాలని విన్నవించారు.  ఆదివాసీలు నిర్వహించిన పాదయాత్రకు సీపీఎం నాయకులు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నేత మోసూరు రాజు, సీపీఎం నాయకుడు కె.జనార్దన్, ఆదివాసీలు, ప్రజా సంఘ నాయుకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement