కార్యకర్తలకు అండగా ఉంటా | Sakshi
Sakshi News home page

కార్యకర్తలకు అండగా ఉంటా

Published Fri, Jan 23 2015 10:55 AM

i always support my cadre said kakani govardhan reddy


 : సర్వేపల్లి ఎమ్మెల్యే  కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు: ఎల్లవేళలా కార్యకర్తలకు అండగా ఉంటానని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శులుగా నియమితులైన మండలానికి చెందిన చేవూరు ఓసూరయ్య యాదవ్, చెందులూరు శ్రీనివాసులు యాదవ్ గురువారం కాకాణిని నెల్లూరులోని ఆయన నివాసంలో కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. కాకాణి వారికి అభినందనలు తెలిపారు. ఈ  సందర్భంగా కాకాణి మాట్లాడుతూ ఎంతోమంది కార్యకర్తలు ఎంతో శ్రమిస్తేనే ప్రస్తుతం పార్టీ ఈస్థాయిలో ఉందన్నారు. అలాంటి కార్యకర్తలకు అన్ని విధాలా అండగా నిలబడతానన్నారు.

 

పార్టీకోసం కష్టపడి పనిచేసే వారిని గుర్తించి వారికి ఒక క్రమపద్ధతిలో పదవుల్లో నియమించే ప్రక్రియ కొనసాగుతుందన్నారు.  జగన్‌మోహన్‌రెడ్డి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. వైఎస్సార్ మరణానంతరం రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ప్రభుత్వం కనీసం రైతులకు సక్రమంగా ఎరువులను కూడా సరఫరా చేయలేకుందన్నారు. అధికార పార్టీ నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఓవైపు స్మార్ట్ విలేజిలంటూ గ్రామాల్లో కనీస వసతులు కూడా కల్పించలేకుందన్నారు. పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై పోరాడాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కడివేటి చంద్రశేఖర్‌రెడ్డి, మన్నెమాల సుధీర్‌రెడ్డి, శ్రీహరిరెడ్డి, దాసరి భాస్కర్ గౌడ్, ఆవుల వెంకటరమణయ్య పాల్గొన్నారు.

Advertisement
Advertisement