ఇంటి యజమానిని హత్య చేసి..? | house owner murdered | Sakshi
Sakshi News home page

ఇంటి యజమానిని హత్య చేసి..?

Feb 4 2015 8:54 PM | Updated on Aug 21 2018 5:46 PM

ఇంటి యజమానిని హత్య చేసి..? - Sakshi

ఇంటి యజమానిని హత్య చేసి..?

కృష్ణా జిల్లా జి.కొండూరు మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం ఒక మహిళ హత్యకు గురైంది.

జి.కొండూరు(కృష్ణా): కృష్ణా జిల్లా జి.కొండూరు మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం ఒక మహిళ హత్యకు గురైంది. పోలీసులు, బాధితురాలి బంధువుల కథనం మేరకు.. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌కు ఎదురుగా ఉండే మోపిదేవి గోపీకృష్ణ, సుజాత(27) దంపతులు తమ ఇద్దరు పిల్లలతో ఉంటున్నారు. అదే ఇంట్లో మరో పోర్షన్‌లో హెడ్‌కానిస్టేబుల్ క్రిస్‌మస్‌రావు కుటుంబం అద్దెకు ఉంటోంది. కాగా, ఇంటి ఆవరణను క్రిస్‌మస్‌రావు కుటుంబం శుభ్రంగా ఉంచటం లేదని గోపీకృష్ణ అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయమై రెండు కుటుంబాల మధ్య తరచూ వివాదం జరుగుతోంది. దీంతో ఇల్లు ఖాళీ చేయాలని క్రిస్‌మస్‌రావుపై ఒత్తిడి తెస్తున్నారు.

ఇదిలా ఉండగా, బుధవారం గోపీకృష్ణ వ్యక్తిగత పనిపై వేరే ఊరు వెళ్లారు. సాయంత్రం గోపీకృష్ణ భార్య సుజాత(27), క్రిస్‌మస్‌రావు భార్య ముంతాజ్‌బేగం మధ్య వివాదం చెలరేగింది. క్రిస్‌మస్‌రావు, అతని కుమారుడు కాంతి కిరణ్, భార్య ముంతాజ్‌బేగం కలసి సుజాతను తీవ్రంగా కొట్టటంతో గాయాలతో మృతి చెందింది. ఆ తర్వాత ఆమెను ఉరి వేసేందుకు ప్రయత్నిస్తుండగా గ్రామస్తులు అక్కడికి చేరుకుని, ఇదేంటని ప్రశ్నించారు. దీంతో వారు నిర్లక్ష్యంగా బదులిచ్చి వెళ్లిపోయారు. దీంతో గ్రామస్తులతో కలసి బాధితుల బంధువులు పోలీస్‌స్టేషన్ ఎదురుగా సుజాత మృతదేహాన్ని ఉంచి ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా, హెడ్‌కానిస్టేబుల్ కుటుంబం కథనం మరోలా ఉంది. సుజాతతో వాగ్వివాదం జరిగిన విషయం వాస్తవమేనని, మనస్తాపం చెందిన ఆమె ఉరివేసుకుని మృతి చెందిందని చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement